
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్లో ఓ వృద్ధురాలిని బెదిరించి దారి దోపిడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామానికి చెందిన లక్ష్మీకాంత అనే వృద్ధురాలు చిన్న బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు రెండు రోజుల పాటు కొట్టు దగ్గరకు వచ్చి సామాన్లు కొనుగోలు చేసి వృద్ధురాలిని మచ్చిక చేసుకున్నారు. అంతేకాదు ఆ ముసలవ్వని మాటల్లో పెట్టి ఆకలి అవుతుంది అన్నం పెడతావా అమ్మ అంటూ అడగడంతో వారికి భోజనం పెట్టి కడుపు నింపింది.
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కంపెనీలో తాము పని చేస్తున్నామని ముసలవ్వతో పరిచయం చేసుకున్న ఆ కేటుగాళ్లు.. పక్కా స్కెచ్తో వృద్ధురాలిని నిలువు దోపిడీ చేశారు. తమకు అన్నం పెట్టినందుకు కృతజ్ఞతగా 50 కేజీల బియ్యం ఇస్తామని.. తమ కంపెనీలో బియ్యం బస్తాలు చాలా ఉన్నాయని తమతో రావాలంటూ చెప్పడంతో కేటుగాడి మాటలు నమ్మిన వృద్ధురాలు అతడి ద్విచక్ర వాహనంపై వేలేరు నుంచి మొరంపల్లి బంజర వెళ్ళింది. ఇదే క్రమంలో అక్కడ మరో వ్యక్తి ఈ కేటుగాడికి జత అయ్యాడు. ఈ పక్కనే తమ క్యాంపు ఉందని వృద్ధురాలిని నమ్మించి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి బెదిరించారు. వృద్ధురాలు నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు, చెవి దిద్దులు, వెండి పట్టీలు దోచుకోవడంతో పాటు ఆమె చేతిలోని పర్సును కూడా ఎత్తుకెళ్లారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. జరిగిన ఘటన నుంచి ప్రాణాలతో తప్పించుకున్న వృద్ధురాలు ఆటో డ్రైవర్ సహాయంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయం తెలిపింది. వృద్ధురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దారిదోపిడికి పడిన కేటుగాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. వృద్ధురాలిని ఆ కేటుగాళ్లు ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అవ్వడంతో పోలీసులు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.