Bayyaram MPP Chepoori Mounika: మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ఎంపీపీ చేపూరి మౌనిక చిక్కుల్లో పడ్డారు. ఎంపీపీగా ఆమె ఎన్నిక చెల్లదని మహబూబాబాద్ ఆర్డీవో కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి మౌనిక గెలిచారని ప్రత్యర్ధులు, పలు గిరిజన కుల సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రెండేళ్లుగా విచారణ కొనసాగుతూ వస్తోంది. అయితే.. విచారణ అనంతరం ఇటీవల ట్రైబల్ వెల్ఫెర్ కోర్టు మౌనిక కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేస్తూ తీర్పు వెలువడింది.
ఈ తీర్పును ఆధారంగా చేసుకుని ఎంపీపీగా మౌనిక ఎన్నిక చెల్లదని మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కొమురయ్య శుక్రవారం ప్రకటించారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఎస్టీ రిజర్వుడు స్థానంలో గెలిచి ఎంపీపీ పదవి పొందారని ఆర్డీవో తెలిపారు. కావున మౌనిక ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రకటించారు.
ఇదిలాఉంటే.. దీనిపై ఎంపీపీ మౌనిక స్పందించారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తానని ఎంపీపీ మౌనిక ప్రకటించారు. తనను కొందరు ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ఎన్నిక సబబేనని ఎంపీపీ మౌనిక పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా.. మౌనిక టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బయ్యారం మండలం కొత్తగూడెం నుంచి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు.
Also Read: