
హైదరాబాద్లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆఫీసులో కాసేపు పర్మిషన్ తీసుకుని సెల్ఫోన్ బాగు చేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఆమె ప్రయాణిస్తున్న బైక్ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన హేమదుర్గ (26) ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చింది. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బస చేస్తూ, బంజారాహిల్స్లోని ప్రముఖ కార్ల షోరూమ్లో ఉద్యోగం చేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా రోజూలాగే ఆఫీసుకు వచ్చిన ఆమె.. తన మొబైల్ ఫోన్ పాడవడంతో దాన్ని రిపేర్ చేయించుకోవాలని భావించింది.
సెల్ఫోన్ బాగు చేయించుకుని త్వరగానే తిరిగి వచ్చేస్తానని ఆఫీసులో పర్మిషన్ తీసుకున్న హేమదుర్గ.. అమీర్పేట వెళ్లేందుకు ర్యాపిడో బైక్ను బుక్ చేసుకుంది. ఆ బైక్పై అమీర్పేట బిగ్బజార్ వెనుక గేట్ సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హేమదుర్గ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా ఈ ఘటనలో గాయపడ్డాడు.
స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. “ఫోన్ రిపేర్ చేయించుకుని గంటలో వచ్చేస్తా” అని చెప్పిన కూతురు విగతజీవిగా మారిందన్న వార్త తెలియడంతో భీమవరంలోని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నత భవిష్యత్తు కోసం నగరానికి వచ్చిన యువతి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో స్నేహితులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.