Telangana: అమెరికా నుంచి వచ్చి నామినేషన్.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం సొంతూరుకు మహిళ..

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓ మహిళ ఆమెరికా నుంచి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా లట్టుపల్లిలో సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో ఆమె హుటాహుటిన ఆమెరికా నుంచి వచ్చి నామినేషన్ దాఖలు చేసింది. తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెబుతుంది.

Telangana: అమెరికా నుంచి వచ్చి నామినేషన్.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం సొంతూరుకు మహిళ..
Sarpanch Candidate From America

Edited By: Krishna S

Updated on: Dec 02, 2025 | 9:40 PM

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సందడి మామూలుగా లేదు. మూడు దశల్లో జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికల రణరంగంలో అనేక విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సారి ముగ్గురు సంతానం ఉన్న పోటీకి అనర్హులు కావడంతో ఇన్నాళ్లు బరిలో లేని వారు ఇప్పుడు సై అంటున్నారు. వ్యక్తిగత, కుటుంబ పనుల కోసం విదేశాలకు వెళ్లిన వారు ఎప్పటికప్పుడు లగేజి సర్దేసుకుని స్వగ్రామంలో వాలిపోతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో సర్పంచి ఎన్నికలు వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లట్టుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఓ మహిళ ఏకంగా అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ కాలం తర్వాత సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీల వారు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కమతం శ్రీనివాస్ రెడ్డి భార్య నందిని పోటీకి సిద్ధమయ్యారు. అయితే పిల్లలు అమెరికాలో సెటిల్ కావడంతో నందిని గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోంది. అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తోంది.

ఇక తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం.. రిజర్వేషన్‌తో పాటు ముగ్గురు సంతానం నిబంధన ఎత్తివేయడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నందిని, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి భావించారు. కూతురు డెలివరీ కావడంతో అక్కడ వారికి సహాయంగా ఉన్నా ఆమె హుటాహుటిన అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. వచ్చి రాగానే అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గెలిపించాలని నందిని గ్రామస్థులను కోరుతున్నారు. ఇక బరిలో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందో ఉత్కంఠగా మారింది. మెరికా నుంచి వచ్చి పోటీ చేస్తున్న కమతం నందినిని గ్రామస్థులు ఆదరిస్తారా లేక తిరిగి పంపిస్తారా వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..