Voter List: ఎస్ఐఆర్లో మీ పేరు లేదని ఆందోళన చెందుతున్నారా..? నో టెన్షన్.. ఇలా చేస్తే మీ ఓటు తిరిగి మళ్లీ వస్తుంది..
తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా విడుదల అయింది. ఎస్ఐఆర్లో అర్హత సాధించని 92 లక్షల 87 వేల 577 మందికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ఇప్పటివరకు లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. అయితే పేరు లేకపోతే ఓటు హక్కు కోల్పోయినట్లు కాదు.

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రక్రియ ఇటీవల ముగియగా.. ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను సోమవార విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లు ఉండగా.. 2 కోట్ల 64 లక్షల 87 వేల 213 మంది ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. వీటిలో కోటి 71 లక్షల 99 వేల 636 మంది ఓటర్లు మాత్రమే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఓటర్లుగా నమోదైనట్లు ఈసీ తెలిపింది. మిగిలిన 92 లక్షల 87 వేల 577 మందికి ఎన్నికల కమిషన్ త్వరలో నోటీసులు ఇవ్వనుంది. వీళ్లు తమ గుర్తింపును నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డులు అందించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా అర్హుతను పరిశీలిస్తారు. దీంతో ఇంకెంతమంది అనర్హులుగా తేలుతారనేది చూడాలి.
73 లక్షల ఓట్లు తొలగింపు
ఇప్పటికే తెలంగాణలో 73 లక్షల 39 వేల ఓట్లను ఈసీ అధికారులు తొలగించారు. నోటీసులు అందుకునే 92 లక్షల 87 వేల ఓటర్లలో ఎంత మంది అర్హుత సాధిస్తారనేది పరిశీలించి తర్వాతి తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల లిస్టులో పేరు కోల్పోయినవారు తిరిగి ఓటు పొందే హక్కు ఉంటుంది. ఎస్ఐఆర్లో పేరు లేనంత మాత్రాన మీరు ఓటు హక్కు కోల్పోయినట్లు కాదు. మీరు మళ్లీ ఓటు పొందవచ్చు. ఓటు కోల్పోయినవారు ఏం చేయాలి..? తిరిగి ఓటు ఎలా పొందాలి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త ఓటర్గా నమోదవ్వడం ఎలా..?
ఎన్నికల కమిషన్ ముసాయిదా జాబితాలో ఓటు లేని వారు మళ్లీ కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫామ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఈసీ వెబ్సైట్కి వెళ్లి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో అధికారులు తనిఖీ చేసి మీకు కొత్త ఓటర్ ఐడీ జారీ చేస్తారు. ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు కూడా ఫామ్-6 ద్వారా ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవచ్చు. అక్టోబరు 19న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే తమ పేరును ఎస్ఆర్లో భాగంగా అకారణంగా తీసివేశారని అనుకున్నా, ఇతర ఫిర్యాదులను సెప్టెంబరు 16 వరకు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావొచ్చు. ఈ మేరకు ఈసీ అవకాశం కల్పిస్తోంది. మీ బీఎల్ఓను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఎస్ఐఆర్లో పేరు లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకుని మళ్లీ పొందవచ్చు.
–
