AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా సరికొత్త రికార్డ్..!

తెలంగాణ ఆర్టీసీ పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే 'రెట్రోఫిట్‌మెంట్' సాంకేతికతను ఉపయోగిస్తోంది. 2027 నాటికి 2800 ఎలక్ట్రిక్ బస్సులతో కాలుష్య రహిత ప్రజా రవాణాను అందుబాటులోకి తేవాలని సంస్థ కృషి చేస్తోంది.

పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా సరికొత్త రికార్డ్..!
Green Ev Bus Fleet And Retrofitment
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Feb 13, 2026 | 9:31 PM

Share

నగరవాసులను అనారోగ్యానికి గురి చేసే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.హైదరాబాద్ లో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్’ సాంకేతికతపై వీసీ, ఎండీ నాగిరెడ్డి గారు మరియు సంస్థ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘రెట్రో ఫిట్మెంట్’ కోసం 15.09.2025 టెండర్లు పిలువగా 30.09.2025 టెండర్ ప్రక్రియ ముగియడంతో సాయి గ్రీన్ మొబిలిటీ సంస్థకు 200, కల్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్ కు 40 బస్సు లను ‘రెట్రో ఫిట్మెంట్’ చేసే బాధ్యతను ఆర్టీసీ అప్పగించింది.

2027 నాటికి హైదరాబాద్ ఓఆర్ ఆర్ లోపల 2800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ప్రజా రవాణా పెరగడంతో కాలుష్యం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ఆరు డిపోల పరిధిలో 325 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, ఈ ఏడాదిలో మరో 175 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే బస్సుల కోసం అదనంగా 19 డిపోలలో చార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్ కేంద్రాలు నిర్మించేందుకుప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మౌలిక సదుపాయాల కోసం సుమారు 392 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా.

2023లోనే ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సును ప్రైవేటు సంస్థ సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారు. ప్రస్తుతం ఈ బస్సు ఉప్పల్ డిపో పరిధిలో విజయవంతంగా నడుస్తోంది.హైదరాబాద్ భవిష్యత్తు కోసం తీసుకొస్తున్న ఈ హరిత ప్రయాణాన్ని ప్రజలు ఆదరించాలని ఆర్టీసీ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి కోరారు. నగర ప్రజా రవాణా రూపురేఖలను మార్చే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బస్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ శ్రీ మునిశేఖర్, శ్రీ వెంకన్న, శ్రీ రాజశేఖర్, శ్రీమతి విజయపుష్ప సాయి గ్రీన్ మొబిలిటీ కల్యాణీ పవర్ ట్రైన్ లిమిటెడ్ ప్రతినిధులు, తదితర సంస్థ అధికారులు, పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..