
తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. సుమారు మున్సిపల్ ఎన్నికల్లో 30కిపైగా స్థానాల్లో హంగ్ రావడంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు తెరలేపాయి. ఫలితాలు వచ్చిన వెంటనే కౌన్సిలర్లను పార్టీలు క్యాంపులకు తరలించాయి. క్యాంపుల నుంచి నేరుగా చైర్మన్ ఎన్నిక సమావేశానికి కౌన్సిలర్లు హాజరకానున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠను రేపుతుండగా.. నిజామాబాద్లో అత్యధిక స్థానాలు వచ్చిన బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంటామని ప్రకటించింది. కరీంనగర్లో కాంగ్రెస్కు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఇతర పార్టీలతో కలిసి బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ ఆఫీషియో ఓట్లతో గట్టెక్కాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్స్ అఫీషియో ఓట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు ఏ మున్సిపాలిటీలో ఉంటే అక్కడే ఓటుకు అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది. గతంలో ఎమ్మెల్సీలు తమకు నచ్చిన మున్సిపాలిటీలో ఓటు వేసేవారు.ఇప్పుడు స్థానిక ఓటు లేకపోతే ఎక్స్ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదు. ఈ నెల 14 తోనే ఎక్స్ అఫీషియో ఓటు రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది.