
జనాలు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా ఇంటి తాళం విరగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకొనే పనిలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శబరి కాలనీలో నివాసం ఉంటున్న విజయ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ బైక్ షోరూంలో సేల్స్ మాన్గా పనిచేస్తున్నారు.
అయితే భాస్కర్ రెడ్డి గత రెండ్రోజులు షోరూమ్లో వసూలైన డబ్బును మొత్తం తీసుకొచ్చి ఇంట్లోని బీరువాలో భద్రపరిచాడు. అయితే బుధవారం పోలింగ్ ఉండడంతో భార్యతో కలిసి భాస్కర్ రెడ్డి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఇంతలో ఇంట్లోకి చొరబడిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం విరగొట్టి బీరువాలో ఉన్న రూ.2లక్షల నగుదుతో పాలు 2 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. భాస్కర్ రెడ్డి ఓటేసి ఇంటికొచ్చే సరికి మెయిన్డోర్కు తాళం లేకపోవడంతో పాటు ఇంట్లో ఉన్న బీరువాలో దాచిన డబ్బు, బంగారం కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్టు భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా అటు కరీంనగర్ జిల్లాలో సైతం ఎన్నికల వేళ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నగరంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందిపై రెండు పిచ్చికుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. వారిని రక్కి గాయపరిచాయి. గమనించిన స్థానికులు కర్రలతో వాటిని తరిమేడంతో కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. ఈ కుక్కల దాడిలో ముగ్గురు ఎన్నికల సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి అక్కడే ఉన్న వైద్య శిభిరంలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చింది ఇంటికి పంపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.