ప్రైవేటు టీచర్లకు ఈనెల 20 – 24 తేదీల మధ్య నగదు జమ, రేషన్ బియ్యం పంపిణీపై తెలంగాణ మంత్రుల చర్చ

Money aid to Private Teachers in Telangana : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న..

ప్రైవేటు టీచర్లకు ఈనెల 20 - 24 తేదీల మధ్య నగదు జమ, రేషన్ బియ్యం పంపిణీపై తెలంగాణ మంత్రుల చర్చ
మీరు 10 వేల రూపాయల కంటే ఎక్కువ వ్యాపారం కోసం నగదు ఖర్చు చేస్తే.. ఆ మొత్తం మీకు వచ్చే లాభానికి జమవుతుందని తెలుసుకోండి..
Follow us

|

Updated on: Apr 09, 2021 | 4:28 PM

Money aid to Private Teachers in Telangana : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు రూ. 2000 ల ఆర్ధిక సహాయం, 25 కిలోల రేషన్ బియ్యం పంపిణీ విషయమై చర్చ జరిగింది. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖా మంత్రి శ్రీ గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు డా. రాజీవ్ శర్మ, శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అర్హులైన వారందరికి ఆర్ధిక సహాయం, బియ్యం పంపిణీ అందేలా చూడాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మానవీయ కోణంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని అర్హులైన ఉపాధ్యాయులను, సిబ్బందిని గుర్తించాలని ఆమె కోరారు. విద్యాశాఖ రూపొందించిన వివరాలను ఈ నెల 10 వతేది నుండి 15 వ తేది మధ్యన సంబంధిత జిల్లాలకు అందజేయనుందని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 16 నుండి 19 వ తేది లోపల ఆ వివరాల పరిశీలన, గుర్తింపు జరుగుతుందని, 20 నుండి 24 వ తేదీల మధ్య వారి బ్యాంక్ అకౌంట్లలో ఆర్ధిక సహాయం జమకానుందని ఆమె తెలిపారు. అదే విధంగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కూడా జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు ఈ పథకం అమలు జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో బి.సి సంక్షేమం, మరియు పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీ గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఇప్పటికే ఆయా మండల కేంద్రాలలో బియ్యం నిల్వలు సిద్ధంగా ఉంచామని, వాటిని పంపిణీకి వాడుకోవాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. ఈ పథకంలో అర్హులైన వారందరికి పంపిణీ జరగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు డా. రాజీవ్ శర్మ మాట్లాడుతూ సంబంధిత ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి చిత్రా రామచంద్రన్, ముఖ్యకార్యదర్శులు శ్రీ రామ కృష్ణారావు, శ్రీ అర్వింద్ కుమార్, శ్రీ వికాస్ రాజ్, కార్యదర్శులు శ్రీ ఎస్ఏయం రిజ్వీ, శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా, శ్రీ రాహుల్ బొజ్జా తదితర అధికారులు పాల్గొన్నారు.

Read also : Temple dispute : దేశంలో తెరపైకి మరో వివాదం, కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞాన్‌వాపి మసీదు‌పై ASI సర్వేకు కోర్టు అనుమతి