మదీనా విషాదం..తీరని కష్టంలో తోడుగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం

మదీనాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్ యాత్రికుల మృతిపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, మృతుల అంత్యక్రియలకు మదీనాలోని జన్నతుల్ బఖీలో ఏర్పాట్లు చేయడమే కాకుండా, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రకటించింది. బంధువుల సౌదీ ప్రయాణ ఖర్చులను కూడా భరించి, కష్టకాలంలో ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకుంది.

మదీనా విషాదం..తీరని కష్టంలో తోడుగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం
Medina Bus Accident

Edited By:

Updated on: Nov 22, 2025 | 9:30 PM

పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ యాత్రికులు మదీనా సమీపంలో ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, ఈ విషాద సమయంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తీసుకున్న తక్షణ చర్యలు ప్రజల హృదయాల్ని గెలుచుకునేలా చేశాయి. ముఖ్యమంత్రి ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాదు..సీఎం కేవలం మాటలతో సరిపెట్టుకోకుండా తక్షణమే రంగంలోకి దిగారు. అమరులకు నివాళిగా వారి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్నారు.

నవంబర్ 17న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పది మంది చిన్నారులతో సహా కనీసం 45 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్, జిర్రా, మెహదీపట్నం, టోలిచౌకి ప్రాంతాలకు చెందినవారే. ఈ దుర్ఘటన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముగ్గురు సభ్యుల అధికారిక బృందాన్ని (మొహమ్మద్ అజారుద్దీన్, డాక్టర్ షఫీవుల్లా, మాజిద్ హుస్సేన్) హుటాహుటిన మదీనాకు పంపారు. ఈ బృందం మూడు రోజులు మదీనాలోనే ఉండి, అక్కడ చట్టపరమైన అనుమతులన్నీ తీసుకుని, అమరుల ఖననం పూర్తయ్యే వరకు పర్యవేక్షించడం నిజంగా అభినందనీయం.

మృతుల పార్థివ దేహాలకు శనివారం, నవంబర్ 22న ప్రవక్త మసీదులో జుహ్ర్ ప్రార్థనల అనంతరం సలాత్ అల్-జనాజా నిర్వహించబడింది. షేక్ అబ్దుల్ బారీ అల్-థుబైతి నాయకత్వం వహించిన ఈ ప్రార్థనల తర్వాత యాత్రికులకు దైవ ప్రవక్త సహచరుల సమాధుల పక్కన ఉన్న జన్నతుల్ బఖీలో శాశ్వత నిద్ర కల్పించడం జరిగింది. కష్ట సమయంలో కూడా తమ ప్రియమైన వారికి పవిత్ర స్థలంలో అంత్యక్రియలు జరిగేలా చూడటం బాధిత కుటుంబాలకు గొప్ప ఓదార్పు. ఆర్థిక సహాయం, మానవీయతకు అద్ధం పట్టేలా ఉంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి కేవలం అంత్యక్రియల ఏర్పాట్లతోనే ఆగిపోలేదు. మానవీయ కోణంలో ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా, మృతుల కుటుంబాలలో 38 మందిని ప్రభుత్వ ఖర్చుతో సౌదీకి పంపించారు. అక్కడ వారు తమ ప్రియమైన వారికి తుది వీడ్కోలు పలకడానికి అవకాశం కల్పించడం నిజంగా ప్రశంసనీయం. ఈ చర్య ముఖ్యమంత్రికి ముస్లింల హృదయాలలో గొప్ప స్థానాన్ని కల్పించింది. రాష్ట్ర సంక్షేమ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌లతో పాటు మహమ్మద్ అలీ షబ్బీర్, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ వంటి ఇతర రాజకీయ నాయకులు సైతం బాధితుల కుటుంబాలను ఓదార్చడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం, నేతల ఓదార్పు బాధితులకు గొప్ప ఊరటనిచ్చింది. పవిత్ర యాత్రకు వెళ్లిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబ సభ్యుల దుఃఖాన్ని కొంతవరకు తేలికపరిచింది. ఈ కష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం చూపిన తక్షణ స్పందన, మానవత్వం, విపత్తు నిర్వహణలో ఒక ఆదర్శవంతమైన చర్యగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us