
పేదలకు సన్న బియ్యం అందించాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుందన్నారు. ఏటా 14,560 కోట్లు సన్న బియ్యం కోసం ఖర్చు చేస్తున్నాం, సన్న బియ్యంతో పేదలకు కడుపునిండా భోజనం పెట్టే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ఎంత భారమైన పేదలకు మేలు చేయాలనే ఆలోచన ఉందని,జనం తినే ఆహారమే అందించాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని అన్నారు. 86 శాతం జనాభాకు సన్న బియ్యం అందుతున్నాయని, సోనియా గాంధీ తెచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లుకు తెలంగాణలో న్యాయం జరుగుతుందన్నారు.
ఇప్పటివరకు తమ ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 40,000 కోట్లు జమ చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొన్న తర్వాత 48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇప్పటివరకు మూడు కోట్ల 39 లక్షల మంది సన్నబియ్యం లబ్ధిదారులున్నారని అన్నారు. అడిగిన అందరికీ రేషన్ కార్డులను ఇస్తున్నామని, అది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుందన్నారు. రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దానికి ఎలాంటి గడువు ఉండదన్నారు. అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి రేషన్ కార్డులు జారీ చేస్తారని పేర్కొన్నారు.
కాగా రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. ఏప్రిల్ నెలలో మూడు నెలల రేషన్ ఒకేసారి అందించేందుకు సిద్దమైంది. దీంతో వచ్చే నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ కూడా ఒకే విడతలో లబ్దిదారులకు అందించనున్నారు. వేసవి దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను కూాడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.