
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు తీపికబురు అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీలకు సెలక్ట్ అయిన బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేయనుంది. బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశం తాజాగా జరిగింది. ఈ సమాశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మీటింగ్కు పాఠశాల, ఉన్నత, ఇంటర్ విద్యాశాఖ అధికారులతో పాటు ఈడబ్ల్యూఐడీసీ, నవోదయ విద్యాలయ సమితి, గురుకుల సొసైటీ అధికారులు కూడా హాజరయ్యారు.
ఇక బీసీ గురుకులాల్లో విద్యార్థి మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గురుకుల పాఠశాలలకు కంప్యూటర్లు, జూనియర్ కాలేజీలకు ఇంటరాక్టివ్ ప్యానెళ్లు అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక గురుకుల సొసైటీ వ్యవసాయ కాలేజీలో బీసీ గురుకుల విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. అలాగే గురుకుల సొసైటీ పేరులో మార్పులు చేశారు. ఇప్పటివరకు మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల సొసైటీగా పేరు ఉండగా.. ఇక నుంచి తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ మహత్మా జ్యోతిరావు ఫులే విద్యాసంస్థల సొసైటీగా పేరు మార్చారు. ఈ బోర్డు సమావేశంలో పేరు మార్పుకు ఆమోదం తెలిపారు. ఇక రాష్ట్రంలో 12 సైనిక స్కూళ్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. దీనిపై నివేదిక తీసుకోవాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు.
ఇక ప్రస్తుతం ప్రీ ప్రైమరీ స్కూల్స్ మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుండగా.. ఈ సమయాన్ని పెంచడంపై ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తొలి దశలో కొన్ని స్కూళ్లల్ల బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. దశలవారీగా అన్ని స్కూళ్లల్లో ప్రవేశపెట్టనుంది. నవంబర్ నాటికి 100 శాతం స్కూళ్లల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కంప్యూటర్లు ల్యాబ్లు ఉన్నచోట ఐసీటీ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు.