
రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతన్నల ఖాతాల్లో డబ్బు జమా చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఇక నవంబర్ నెలలో రావాల్సిన రెండో విడత రైతు బంధు నిధులు అప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి.
ఇక అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది. మూడు వారాల క్రితమే రైతు బంధు డబ్బుల విడుదలపై సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం తొలుత 10 గంటల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది. ఆ తర్వాత ఎకరం ఉన్న వాళ్లకు నిధులను జమ చేసింది. ఇక ఎకరం ఆపై భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు నిధులు జమకాలేవు. అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది.
గురువారం ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాని అధికారులు తెలిపారు. ఒకటి లేదా రెండు రోజుల్లో మిగతా అందరి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులను జమ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో రైతులకు శుభవార్త చెప్పినట్లైంది. రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో ఒకింత రైతులు ఆందోళన చెందారు. అయితే తాజాగా ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య భూమి ఉన్న వారికి రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలపడం రైతుల కళ్లలో సంతోషాన్ని నింపింది.
ఇదిలా ఉంటే.. కొత్తగా పాస్ బుక్ వచ్చిన వారికి పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా… రెండు రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ ను ఫ్రీజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… రైతుభరోసాకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పేరుతో అమలు చేయనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..