Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అదిరిపోయే వార్త.. యాప్లో కీలక మార్పులు.. కొత్త విధానం అమల్లోకి..
ఇందిరమ్మ ఇళ్ల యాప్లో ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త మాడ్యూళ్లను యాప్లో ప్రవేశపెట్టింది. దీని వల్ల లబ్దిదారుల ఎంపిక అనేది మరింత వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ ప్రాసెస్ను మరింత తగ్గించారు. అలాగే అనర్హులు సరైన ఆధారాలు సమర్పిస్తే.. ఎల్-1 జాబితాలోకి మార్చుతారు.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమల్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కీలక ముందడుగు వేసింది. లబ్దిదారులకు ఆలస్యం చేయకుండా బిల్లులు చెల్లింపు, టెక్నికల్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు యాప్లో మార్పులు చేసింది. ఇందిరమ్మ యాప్లో అత్యాధునిక మాడ్యూళ్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మాడ్యూళ్ల వల్ల లబ్దిదారులను సులువుగా గుర్తించడంతో పాటు వేగంగా ప్రక్రియ పూర్తవుతుంది. గతంలో ఉన్న పాత మాడ్యుళ్ల స్థానంలో ఈ కొత్త వాటిని తీసుకొచ్చారు. పూర్తిగా డిజిటలైజ్ చేయడంతో పాటు భవిష్యత్తులో లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు.
యాప్లో కొత్త మాడ్యూల్స్..
ఈ కొత్త మాడ్యుళ్ల వద్ద భవిష్యతులో డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదని ప్రభుత్వం చెబుతోంది. లబ్దిదారుల ఎంపిక, నిర్వహణ, మార్పులు, చేర్పులు, అనుమతుల ప్రక్రియ ఇప్పటివరకు ఆలస్యమవుతోంది. కానీ ఇప్పుడు యాప్లో ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ల వల్ల ప్రాసెస్ అంతా క్షణాల్లోనే పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లను దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేపట్టేవారు. మాన్యువల్గా ఒక నివేదిక ఇచ్చేవారు. దీని వల్ల లబ్దిదారుల గుర్తింపు ఆలస్యం కావడంతో పాటు డేటా ఎంట్రీలో పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ కొత్త యాప్లో మాన్యువల్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. యాప్లో అర్హులైన లబ్దిదారులు, మొత్తం విచారణ జరిపిన లబ్దిదారులు అనే రెండు కొత్త ఆప్షన్లను తీసుకొచ్చారు.
అంతా ఆటోమేటిక్
అధికారులు యాప్లో నమోదు చేయగానే.. ఆటోమేటిక్గా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ల లాగిన్కు వెళుతుంది. పరిశీలన పూర్తయిన తర్వాత కలెక్టర్ల అనుమతికి వెళుతుంది. కలెక్టర్లు ఆమోదం తెలిపాక లబ్దిదారుడికి ఇళ్లు మంజూరు చేస్తారు. ఈ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటు మాన్యువల్ ప్రక్రియ ఉండదు. దీని వల్ల వేగంగా లబ్దిదారులను గుర్తించడంతో పాటు పేపర్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. అలాగే డిజిటల్గా అన్నీ పనులు చేయడం వల్ల డేటా ఎంట్రీలో కూడా తప్పులు జరగవు. ఇక తమకు అర్హత ఉన్న ఎల్-3 జాబితాలో చేర్చారని ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ యాప్లో ఎల్-3 నుంచి ఎల్-1 అనే కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. దీంతో అనర్హులుగా తేలినవారు సరైన ఆధారాలు సమర్పిస్తే ఎల్-1 లబ్దిదారు జాబితాలోకి మార్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల నిజమైన అర్హులకు ఎలాంటి నష్టం జరగదు.
