
Telangana Assembly Election 2023: తెలంగాణలో రాజకీయ జాతర నడుస్తోంది. జాతర అంటే ఇంటికి చుట్టాలు వస్తారు కదా.. అలాగే పొలిటికల్ జాతరలోనూ చుట్టాలు క్యూకడుతున్నారు. ఢిల్లీ నేతలు రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. తెలంగాణ ఎన్నికల మహా సంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు జాతీయస్థాయి నేతలు ఒకరివెంట ఒకరు రాష్ట్రానికి వస్తున్నారు. భారీ ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు అన్ని పార్టీల నేతలు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు హోరెత్తే ప్రచారాలతో ఈ సారి ఎన్నికలు మునుపటి లెక్క ఉండవు అనే రేంజ్కి తీసుకెళ్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూకడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈనెల 27న సూర్యాపేటలో అమిత్షా బహిరంగ సభ జరగనుంది. అమిత్ షా తర్వాత షెడ్యూల్ తర్వాత జేపీ నడ్డా కూడా పర్యటించనున్నారు.
బీజేపీ నేతల షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే.. ఈ నెలాఖరులో తెలంగాణ బాటపట్టబోతున్నారు బీజేపీ జాతీయ నేతలు. అమిత్షా, నడ్డాతో పాటు.. ప్రధాని మోదీ కూడా బహిరంగ సభల్లో పాల్గొనేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. నవంబర్ 20లోపు మొత్తం 15కి పైగా సభల్లో ఇద్దరు లీడర్లు పాల్గొనేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ప్రధాని మోదీనే ఐదు నుంచి 10 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సభలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ సభలు హైలెట్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. అగ్రనేతల సభల్లో ప్రకటన కోసం మేనిఫెస్టోపైనా బీజేపీ కసరత్తు చేస్తోంది.
ఇదిలాఉంటే.. అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు చేస్తున్న బీజేపీ అధిష్టానం.. అసంతృప్తుల బుజ్జగింపులకు కూడా ప్లాన్ చేస్తోంది. తొలి జాబితా తర్వాత రోజురోజుకీ అసంతృప్తుల లిస్ట్ పెరుగుతోంది. బండి సంజయ్, వివేక్లో కూడా కొంతమేర అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. తనవాళ్లకు టిక్కెట్లు ఇప్పించుకోలేకపోయానన్న ఆవేదనలో బండి సంజయ్ ఉన్నట్లు సమాచారం.. ఇక తనతో చర్చలే జరపలేదంటూ మాజీ ఎంపీ వివేక్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అమిత్ షా అసంతృప్త నేతలతో విడివిడిగా భేటీకాబోతున్నట్లు సమాచారం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సభను సక్సెస్ చేసేందుకు తెలంగాణ పార్టీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..