తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. ఫస్ట్ లిస్ట్లో వీరి పేర్లు పక్కా
కమలం చాలీసా... కమింగ్ సూన్. ఎస్.. తొలి జాబితాతో రెడీ టు ఫైట్ అంటోంది కమలం పార్టీ. తెలంగాణాలో మొత్తం 40 మంది పేర్లతో కిషన్రెడ్డి జేబులో లిస్టు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాగల 48 గంటల్లో ఏ క్షణాన్నయినా ఆ జాబితా రిలీజ్ కావొచ్చు. ఇంతకీ ఆ హాట్ లిస్టులో ఉండే స్టార్ క్యాండేట్లు ఎవరు...? సీటు గ్యారంటీ పథకంలో ఫైనల్ విన్నర్లు ఎవరు..? ఎక్స్క్లూజివ్గా తెలుసుకుందాం...

తెలంగాణాలో ఎన్నికల నోటిఫికేషన్కి కౌంట్డౌన్ ముంచుకొచ్చేస్తోంది. అందుకే రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ దూకుడు బీఫామ్స్ పంచేదాకా వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా సగం దాకా సీట్లతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసి.. అలకలు, పూనకాల వార్తలతో లైమ్లైట్లో ఉంది. మరి.. మేం మాత్రం స్తబ్దుగా ఎందుకుండాలి అనుకుందో ఏమో బీజేపీ కూడా స్పీడు పెంచేసింది. -తెలంగాణా బీజేపీలో మూడో వంతు… అంటే దాదాపు 40 సీట్లపై ఓ లెక్కకొచ్చేసింది అధిష్టానం. కాకపోతే… కొన్ని పేర్లు అటూఇటూ అయ్యే ఛాన్సుంది. ఇప్పటికే అనేక విడతలుగా జాతీయ ఎన్నికల కమిటీ సమావేశమైంది. మొదట్లో ఈనెల 10న తొలి జాబితా విడుదల అనుకున్నారు.. కుదర్లేదు. తర్వాత 14 తర్వాత రిలీజ్ చేద్దామనుకున్నారు. అదీ కుదర్లేదు. సీనియర్లు, కీలక నేతలందరినీ పోటీకి పెట్టాలన్నది మొదట అనుకున్న మాట. కానీ.. కొన్నిచోట్ల పరిస్థితులు అనుకూలించక… ఆ నిర్ణయంపై వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం ఆశావహుల నుంచి భారీ స్థాయిలో దరఖాస్తులొచ్చాయి. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురేసి టిక్కెట్లు కోరుకున్నారు. వాళ్ల పనితీరును, మిగతా క్వాలిటీల్ని లెక్కగట్టి జల్లెడ పట్టింది కేంద్ర ఎన్నికల కమిటీ. మిగతా పార్టీలతో పోలిస్తే బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది బీజేపీ తీసుకున్న కీలక నిర్ణయం. మరికొన్ని అంశాల్ని కూడా బేరీజు వేసుకుని జాబితాను సిద్ధం చేసింది బీజేపీ. ఇంతకీ.. రేపో ఎల్లుండో రిలీజ్ కాబోయే బీజేపీ లిస్టులో బంపరాఫర్ ఎవరికి.. శృంగభంగం ఎవరికి..? పోటీలో నిలబడబోయే వీఐపీ క్యాండేట్లు ఎవరు.. తెలుసుకుందాం పదండి.
- అంబర్పేట- కిషన్రెడ్డి
- కరీంనగర్ – బండి సంజయ్
- హుజూరాబాద్, గజ్వేల్ – ఈటల రాజేందర్
- మెదక్ – విజయశాంతి
- గద్వాల – డీకే అరుణ
- దుబ్బాక – రఘునందన్రావు
- కోరుట్ల – ధర్మపురి అరవింద్
- ఇబ్రహీంపట్నం- బూర నర్సయ్యగౌడ్/ దయానంద్గౌడ్
- నిర్మల్ – మహేశ్వర్రెడ్డి
- సనత్నగర్- మర్రి శశిధర్రెడ్డి
- మహబూబ్నగర్- జితేందర్రెడ్డి
- కల్వకుర్తి – ఆచారి
- ధర్మపురి (SC) – వివేక్ వెంకటస్వామి
- సికింద్రాబాద్- బండ కార్తీక
- బోధ్ (ST)- సోయం బాపూరావ్
- ఖానాపూర్ (ST) – రమేశ్ రాధోడ్
- చొప్పదండి (SC) – బొడిగె శోభ
- మానకొండూరు (SC)- ఆరెపల్లి మోహన్
- ఆందోల్ (SC) – బాబూమోహన్
బీజేపీలో చేరడం కోసం మునుగోడును వదులుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి… ఉపఎన్నికలో కూడా పరాజయం పాలయ్యారు.. ఇప్పుడా మునుగోడుకు పూర్తిగా బైబై చెప్పి.. హైదరాబాద్కి షిప్ట్ అవుతారట. ఎల్బీనగర్ సీటు ఆశిస్తున్న రాజగోపాల్రెడ్డి అప్పీల్ అధిష్టానం పరిశీలనలో ఉంది. కానీ.. మరో ఇద్దరు ఇదే సీటు కోసం పోటీ పడుతున్నారు. అటు… సూర్యాపేట నుంచి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, వరంగల్ (తూర్పు) నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు ప్రదీప్రావు పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. ఇలా మొత్తం 40 మందితో బీజేపీ తొలి జాబితా సిద్ధమైంది.
తెలంగాణాలో కమలం పార్టీతో కలిసొచ్చే పార్టీలేవీ లేవు కనుక.. పొత్తుకు సంబంధించిన చిక్కుముళ్లేవీ ప్రస్తుతానికి లేనట్టే. కాకపోతే.. పీకే ఫ్యాక్టర్ ఒక్కటే బీజేపీని తెలంగాణాలో ఊరిస్తోంది. ఇటీవలే జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ని కలిసి చర్చలు జరిపారు బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి. సీట్లు అడక్కుండా బేషరతుగా మద్దతివ్వాలని పవన్కి ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 30 సీట్లలో మావాళ్లు పోటీకి రెడీ అంటూ ఒక లిస్టే రిలీజ్ చేసింది జనసేన. ఒకవేళ బీజేపీతో ఒప్పందం కుదిరి ఎన్నోకొన్ని సీట్లు డిమాండ్ చేస్తే… ఆ ప్రభావం కమలం పార్టీ తొలి జాబితాపై కనిపించే అవకాశముంది.
జవదేకర్ ఇంట్లో మధ్యాహ్నం వరకు బీజేపీ తెలంగాణా కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. తర్వాత… పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు తెలంగాణా బీజేపీ కీలక నేతలు. 40కి పైగా అభ్యర్థులతో సిద్ధమైన తొలి జాబితాపై అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. ఫస్ట్ లిస్టుపై నేతలిస్తున్న క్లారిటీ అతి త్వరలో రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
