సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటో.. ప్రభుత్వ బడికి ఊపిరి పోసిన ముగ్గురు ఉపాధ్యాయులు!
Mancherial News: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ సొంత జీతంతో విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పిస్తున్నారు. నోటు పుస్తకాలు, మినరల్ వాటర్, మౌలిక సదుపాయాల కోసం కూడా ఖర్చు చేస్తూ ప్రభుత్వ బడిని అభివృద్ధి చేసి విద్యార్థుల సంఖ్యను 14 నుంచి 36కు పెంచి ఆదర్శంగా నిలిచారు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు సరోజ, శోభారాణి తమ సొంత డబ్బులతో విద్యార్థుల కోసం ఆటో ఏర్పాటు చేసి పాఠశాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ పాఠశాలలో ఐదు తరగతులకు కలిపి కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా, బదిలీపై వచ్చిన ఈ ముగ్గురు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను చైతన్యపరిచారు. వారి కృషితో మొదట విద్యార్థుల సంఖ్య 21కు, ప్రస్తుతం 36కు పెరిగింది. మరో నలుగురు విద్యార్థులు కూడా త్వరలో చేరే అవకాశం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ఉపాధ్యాయులు, మొదట నెలకు రూ.3 వేలతో ఆటో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కత్తెరసాల, సుబ్బరాంపల్లి గ్రామాల విద్యార్థులను ప్రతిరోజూ పాఠశాలకు తీసుకువచ్చి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు నెలకు రూ.5 వేల చొప్పున తమ సొంత డబ్బులు వెచ్చిస్తూ ఆటో నిర్వహిస్తున్నారు.
ఇంతటితో ఆగకుండా, విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ప్యాడ్లు, రిబ్బన్లు అందించడంతో పాటు తాగునీటి కోసం మినరల్ వాటర్ కూడా తమ ఖర్చులతో అందిస్తున్నారు. అలాగే పాఠశాల ప్రహరీ నిర్మాణం, గేటు, పిల్లలు ఆడుకునే మైదానం, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా కృషి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ జీతంలో నుంచి ఖర్చు చేస్తూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఈ ముగ్గురు ఉపాధ్యాయులు నిజంగా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వీడియో చూడండి..
