
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన శివ.. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా పని చేస్తున్నాడు. ఇదే పట్టణానికి చెందిన నరేష్ తో శివకు పరిచయం ఉంది. శివ తన అవసరాల కోసం నరేష్ నుండి 15 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు ఎంతకూ తిరిగి ఇవ్వక పోవడంతో శివను నరేష్ నిలదీశాడు. దీంతో తనకు తెలిసిన షాపులో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి నరేష ను శ్రీ సాయిరాం జువెలరీ షాప్ కు శివ తీసుకెళ్లాడు. అక్కడ మూడు బంగారు బిస్కెట్లను నరేష్ కొనుగోలు చేశాడు. నరేష్ వాటిని భద్రంగా బ్యాంకు లాకర్ లో దాచుకున్నాడు.
ఈ బంగారు బిస్కెట్లను విక్రయించాలని భావించిన నరేష్.. ఫిబ్రవరి 25న తక్కువ ధరకు తాను కొనుగోలు చేసిన శ్రీ సాయిరాం జువెలరీ షాప్ కు వెళ్లాడు. అయితే ఇది నకిలీ బంగారు బిస్కెట్లని కొనుగోలు చేయనని వ్యాపారి తేల్చిచెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తనకు విక్రయించిన నకిలీ బంగారు బిస్కెట్లను ఎందుకు కొనుగోలు చేయవని గోల్డ్ షాప్ యజమానినీ నరేష్ నిలదీశాడు. ఈ క్రమంలో బంగారు బిస్కెట్లను తీసుకుని రూ.5 లక్షలు తిరిగి నరేష్ కు ఇచ్చాడు.
నకిలీ బంగారం వ్యవహారం హుజూర్ నగర్ పట్టణంలో హల్ చల్ చేయడంతో గోల్డ్ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే శివ.. తనకు నకిలీ బంగారం బిస్కెట్లు విక్రయించాడని పోలీసులకు చెప్పడంతో నకిలీ బిస్కెట్ల వ్యవహారం వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.