సూర్యాపేటలో మరోసారి విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి. 4606 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. జగదీష్ రెడ్డికి 75143 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి 70537 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు 40407 ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో సూర్యాపేట నియోజకవర్గం (Suryapet Assembly Election) ఒకటి. జగదీష్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ నుంచి మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, బీఎస్పీ నుంచి వట్టి జానయ్య యాదవ్ బరిలో నిలవడంతో అక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నారు దామోదర్ రెడ్డి. మరో కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. అధిష్ఠానం బుజ్జగించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే సూర్యాపేట ఓటర్లు మాత్రం జగదీష్ రెడ్డినే ఆశీర్వదించారు
అప్పటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన వరకు సూర్యాపేట పాత్ర ఎనలేనిది. ఈ ప్రాంత ఓటర్లు.. బీజేపీ మినహా అన్ని పార్టీలను గెలిపించారు. 1952లో నియోజకవర్గం ఏర్పాటు కాగా.. నాలుగుసార్లు పీడీఎఫ్, ఒకసారి సీసీఐ, మరోసారి సీపీఎం, రెండు పర్యాయాలు కాంగ్రెస్, మూడుసార్లు టీడీపీ, మళ్లీ మూడుసార్లు కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. ఇదంతా రాష్ట్ర ఏర్పడకముందు ముచ్చట. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టారు. సూర్యాపేటలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన జగదీష్ రెడ్డి వరుసగా రెండుసార్లు విజయం సాదించారు. 2018 ఎన్నికల్లో జగదీష్రెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, దామోదరరెడ్డిపై 5,941 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. జగదీస్ రెడ్డికి 66742 ఓట్లు రాగా, దామోదరరెడ్డికి 60801ఓట్లు పోలయ్యాయి. బీజేపీ తరఫున బరిలోకి దిగిన సంకినేని వెంక టేశ్వరరావుకు 39 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.
అంతకు ముందు 2014లో జగదీష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు (స్వతంత్ర) 2,219 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగదీష్ రెడ్డికి 43,554 ఓట్లు రాగా.. సంకినేనికి 41,335 ఓట్లు, రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్)కి 39,175 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డికి 38,529 ఓట్లు దక్కాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్