కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలే పణం..! బస్సులు ఆగక ట్రాక్టర్లపై వేలాడుతున్న విద్యార్థులు
మెదక్ జిల్లా చిట్కుల గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినులు రోజూ రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తుండగా, విద్యార్థులు ట్రాక్టర్లపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. స్థానికులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

చదువుకోవాలన్న వారి ఆశకు.. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. నిత్యం కాలేజీకి వెళ్లి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆ విద్యార్థులు.. రోడ్లపై కిలోమీటర్ల మేర నడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. ప్రమాదకరంగా ట్రాక్టర్లపై వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిలిపిచేడు మండల పరిధిలోని చిట్కుల గ్రామంలో నిత్యం కనిపిస్తున్న దైన్య స్థితి ఇది. చిట్కుల గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు.. ఉన్నత చదువుల కోసం నిత్యం జోగిపేట కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆ రూట్లో వెళ్లే ఆర్టీసీ బస్సులు ఫుల్ అయి వస్తున్నాయని, చిట్కుల గ్రామం వద్ద అసలు ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థినులు రోజూ చిట్కుల గ్రామం నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన రావాల్సి వస్తోంది.
గత నాలుగు రోజులుగా ఇదే దుస్థితి కొనసాగుతోందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాలేజీకి సమయం దాటిపోతుండటం.. మరోవైపు బస్సులు ఆపకపోవడంతో.. అబ్బాయిలైతే ఏకంగా ప్రాణాలకు తెగిస్తున్నారు. రోడ్డుపై వెళ్లే ట్రాక్టర్లను ఆపి, వాటి వెనుక ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఏ చిన్న అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ఇలా విద్యార్థుల కోసం బస్సులు ఆపకుండా వెళ్తున్న డ్రైవర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, చిట్కుల గ్రామం వద్ద బస్సులు ఆపాలని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
వీడియో చూడండి..
