
హైదరాబాద్ ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ నలుదిక్కులే కాదు, నింగి వరకు చేరనుంది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే స్థాయికి మన భాగ్యనగరం చేరింది. ముఖ్యంగా, శంషాబాద్లోని ఈ ప్రాంతం త్వరలోనే దేశానికి కొత్త స్పేస్ హబ్గా మారబోతోంది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ… స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉంది. రాకెట్ డిజైన్ తయారీ నుంచి ఇంటిగ్రేషన్, టెస్టింగ్ వరకు రాకెట్ తయారీకి కావాల్సిన అన్నీ ఒకే క్యాంపస్లో అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో నెల ఒక ఆర్బిటల్ రాకెట్ తయారు చేసే సామర్థ్యం ఈ క్యాంపస్ సొంతం. ప్రైవేట్ రంగంలో ఇది సరిగ్గా మిషన్ రెవల్యూషన్ అంటూ ప్రధాని కొనియాడారు.
ఇక అసలు సంచలనం… విక్రమ్-1. ఇది దేశంలోని తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్. కార్బన్-ఫైబర్ బాడీ, 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లతో తయారైన ఈ రాకెట్… తక్కువ బరువు, తక్కువ ఖర్చుతో పాటు అధిక పనితీరును అందించనుంది. 480 కిలోల ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ (Low Earth Orbit) లోకి తీసుకెళ్లగల సామర్థ్యం ఈ రాకెట్ సొంతం. ప్రపంచ స్మాల్ సాటిలైట్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ భారత కీర్తి కిరీటాన్ని నింగి వరకు చేర్చనుంది ఈ విక్రమ్-1.
ఇది భారత్ స్పేస్ మార్కెట్ను ప్రపంచ పోటీలో ముందుకు నెట్టే రాకెట్. ఇన్నేళ్లు రాకెట్ అంటే ISRO, కానీ ఇవాళ ప్రైవేట్ రంగం కూడా అంతరిక్షంలోకి ఎగరబోతోంది. భారత్లో మొదటిసారిగ ప్రైవేట్ క్యాంపస్, ప్రైవేట్ డిజైన్, ప్రైవేట్ రాకెట్, కమర్షియల్ లాంచ్కు మార్గం సిద్ధమవుతోంది. ఈ క్యాంపస్ రావడంతో హైదరాబాద్కు వేల కొద్దీ హై-టెక్ ఉద్యోగాలు లభిస్తాయి. దేశానికి తక్కువ ధరలో రాకెట్ సేవలు, ప్రపంచానికి కొత్త స్పేస్ లాంచ్ డెస్టినేషన్ లభించినట్టే. త్వరలోనే విక్రమ్-1 లాంచ్ ఉంటుంది. ఆ తర్వాత విక్రమ్-2, విక్రమ్-3 రాకెట్లు కూడా సిద్ధమవుతాయనీ స్కై రూట్ తెలిపింది. ప్రపంచ చిన్న సాటిలైట్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని స్కైరూట్ స్పేస్ ఎకానమీకి కొత్త వేగం ఇవ్వబోతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.