ముగిసిన కేసీఆర్ విచారణ.. ప్రజల దృష్టి మళ్లీంచడానికే సిట్ విచారణ పేరుతో వేధింపులుః కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నాలుగు గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది. మద్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అధికారులు.. ఏడు గంటల 45 నిమిషాలకు వెళ్లిపోయారు. విచారణ సమయంలో కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత పెట్టారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నాలుగు గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది. మద్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అధికారులు.. ఏడు గంటల 45 నిమిషాలకు వెళ్లిపోయారు. విచారణ సమయంలో కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత పెట్టారు. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో అధికారులు రికార్డ్ చేశారు. రెండో అంతస్తులోని ఓ గదిలో కేసీఆర్ విచారణ సాగింది.
విచారణ ముగిసిందని తెలియగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలంతా నందినగర్ చేరుకున్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నందినగర్కు తరలివచ్చారు. దీంతో ఇంటి బాల్కనీలోకి వచ్చి.. కార్యకర్తలకు కేసీఆర్ ఆభివాదం చేశారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్రావు, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కేసీఆర్ భేటీ అయ్యారు. న్యాయ నిపుణులతోనూ చర్చించారు.
చివరగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలంగా ఉంది. బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం అవుతోంది. త్వరలో చాలా మంది బీఆర్ఎస్లో చేరుతారని కేసీఆర్ అన్నారు. అనంతరం నందినగర్ నుంచి ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు కేసీఆర్ బయలుదేరి వెళ్లిపోయారు.
కేసీఆర్ సీట్ విచారణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన సాధించుకున్న ధీశాలి కేసీఆర్ అన్నారు. ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేసే వ్యక్తి కేసీఆర్ అని గుర్తించారు. చిల్లర రాజకీయాలకు, నీచమైన ఎత్తుగడలకు కేసీఆర్ భయపడే వ్యక్తి కాదన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత విషం చిమ్మినా.. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కేసీఆర్ ను విచారణ పేరుతో వేధిస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని కేటీఆర్ ఆరోపించారు. చట్టప్రకారం కేసీఆర్ ఉన్న చోటే విచారణ జరగాలి. అయినా చట్టాన్ని గౌరవిస్తూ కేసీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారని కేటీఆర్ తెలిపారు. ప్రజల్లో అపోహలు, అసత్యాలు సృష్టించేందుకే సిట్ విచారణ పేరుతో నాటకాలు అడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇదిలావుంటే, కేసీఆర్ విచారణ మొదలైన దగ్గర నుంచి ముగిసే వరకు తెలంగాణ భవన్ దగ్గర అనేకసార్లు ఉద్రిక్తత చోటుచేసుకుంది. రేవంత్ ఇంటి వైపు వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా కార్యకర్తలు కూడా పలుమార్లు ఆందోళనకు దిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
