
దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన జరిగిన మహిళ దహనం కేసు సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం, స్థానికుల వివరాల ప్రకారం..
భూంపల్లికి చెందిన విజయ(45) అనే మహిళను పక్కా స్కెచ్తో హతమార్చింది మరెవరో కాదు..రజిత(38) అనే మహిళ, ఆమె మైనర్ కుమారుడు…డబ్బుపై వ్యామోహంతో ఈ తల్లి, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. విజయకు ఉన్న కుటుంబ గొడవలను ఆసరాగా చేసుకుని, ఆమెను తమ ఇంటికి పిలిపించారు. నమ్మకంగా ఇంట్లోకి తీసుకెళ్లి.. తల్లి, కొడుకు కలిసి విజయ గొంతు పిసికి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు సినిమా ఫక్కీలో ప్లాన్ వేశారు.
రాత్రి సమయంలో మృతదేహాన్ని టీవీఎస్ ఎక్స్ఎల్ (TVS XL) బైక్పై మధ్యలో కూర్చోబెట్టుకుని రామక్కపేట శివారుకు తరలించారు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహాన్ని పూర్తిగా తగలబెట్టారు. విజయ ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారు..వీరు చేసిన పనులు అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి..పోలీసుల విచారణలో తేలిన నిజాలు చూసి ఖాకీలే ముక్కున వేలేసుకున్నారు..
ఈ కిల్లర్ తల్లి, కుమారుడు ఇలాంటి హత్య చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మే నెలలోనూ రేఖ అనే మరో మహిళను వీరు ఇదే తరహాలో గొంతు పిసికి చంపేశారు. అనంతరం శవాన్ని అచ్చుమయిపల్లి అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టారు. ఆస్తి గొడవలు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న మహిళలనే ఈ ముఠా టార్గెట్ చేస్తోంది. వారిని నమ్మించి, గొంతు కోసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడమే వీరి ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు..
ఈ ఇద్దరు కిల్లర్స్ ఇంతటితో ఆగలేదు. ఈజీ మనీ కోసం మరో నలుగురు మహిళలను హత్య చేసేందుకు ఇప్పటికే టార్గెట్ లిస్ట్ సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు అరెస్ట్ చేసి,తల్లిని జైల్ కి పంపగా.. కొడుకును జ్యూవెయినల్ హోమ్ కి తరలించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..