
ఫుల్గా తాగేని ఓ వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి మృత్యువుతో చెలగాటమాడి హాస్పిటల్ పాలైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (మం) ఇస్నాపూర్ ఓడీఎఫ్ కాలనీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసించే నర్సింలు అనే యువకుడు శుక్రవారం విపరీతంగా మద్యం సేవించి, మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో కాలనీలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కాడు. అక్కడితో ఆగకుండా పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి నర్సీములు ట్రాన్స్ఫార్మర్ పై నుండి కిందపడిపోయాడు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర అస్వస్థతకు గురైన నర్సిములును చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింలు పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
అయితే నర్సిములు మద్యం మత్తులోనే ఇలా చేశాడా లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో ఇలాంటి ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మద్యం సేవించి ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం ప్రాణాల మీదకు తెస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.