Hyderabad: హైదరాబాద్లో మరో ఘాతుకం.. నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణ హత్య!
రాజేంద్రనగర్ డీసీపీ జోన్ పరిధిలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఒక రౌడీ షీటర్ హత్య సంచలనం రేపుతోంది. నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

రాజేంద్రనగర్ డీసీపీ జోన్.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. జనాభా పెరుగుతోంది.. కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. కానీ అదే సమయంలో నేరాలు కూడా ఆందోళన కలిగించే స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హత్యలు, హత్యాయత్నాల ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వెంబడించి.. కిరాతకంగా నరికి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు
నడిరోడ్డుపై నరికి చంపారు..
ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మైలార్దేవుపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నారు.
టార్గెట్ ఎవరు? కారణం ఏంటి?
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. మృతుడు రౌడీషీటర్ కావడంతో.. ఈ హత్యకు పాత కక్షలే కారణమా? గతంలో జరిగిన గొడవలకు ప్రతీకారంగా హత్య చేశారా? లేక మరేదైనా వివాదం ఈ ఘటనకు దారితీసిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి గత నేరచరిత్ర, అతడితో ఉన్న వివాదాలు, ఇటీవల ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ముందస్తు రెక్కీ చేశారా?
నడిరోడ్డుపై వెంబడించి మరీ హత్య చేయడం చూస్తుంటే.. నిందితులు ముందుగానే మృతుడి కదలికలను గమనించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కదలికలు, ఘటనకు ముందు అతడిని ఎవరైనా ఫాలో అయ్యారా? సమీపంలోని సీసీ కెమెరాల్లో ఏమైనా కీలక దృశ్యాలు రికార్డ్ అయ్యాయా? అనే అంశాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి.
రాజేంద్రనగర్ జోన్లో వరుస ఘటనలు..
తాజా హత్యతో రాజేంద్రనగర్ డీసీపీ జోన్లో నేరాలపై మరోసారి చర్చ మొదలైంది. హత్యలు, హత్యాయత్నాలు వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ప్రాంతంలో నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? పాత నేరస్తుల మధ్య కక్షలు మళ్లీ రాజుకుంటున్నాయా? భూవివాదాలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత గొడవలు హత్యలకు కారణమవుతున్నాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, మృతుడి పాత పరిచయాలు.. ఈ కేసులో కీలకంగా మారే అవకాశముంది.నడిరోడ్డుపై రౌడీషీటర్ హత్య.. ముందే పక్కా ప్లాన్ చేశారా? ఎవరి కోసం టార్గెట్ చేశారు? ఈ హత్య వెనుక అసలు కథ ఏంటి? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తు సమాధానం చెప్పాల్సి ఉంది.
