
Hyderabad, September 30: బ్లఫ్ మాస్టర్ మూవీలోని ఈ సీన్ చూశారుగా.. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే హైదరాబాద్లో రియల్గా జరిగింది. రైస్ పుల్లింగ్ పేరుతో కోట్లు కొట్టేశారు కేటుగాళ్లు. రాగిచెంబు ఆశచూపి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త నుంచి నిజంగానే రూ. 3 కోట్లు స్వాహా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేడిపల్లికి చెందిన విజయ్కుమార్ ఓ బార్బర్. జల్సాలకు అలవాటు పడిన విజయ్.. రియల్టర్గా అవతారమెత్తాడు. పంజాగుట్టలోని ఓ పబ్బులో విజయ్కి, రియల్టర్ కిరణ్ పరిచయం ఏర్పడింది. కిరణ్ వీక్నెస్ గమనించిన విజయ్కుమార్.. తన దగ్గర మహిమగల రాగిచెంబు ఉందని ప్రచారం చేశాడు. తన దగ్గర ఆకాశం నుంచి భూమిపై పిడుగులు పడే సమయంలో ఏర్పడ్డ శకలాలతో తయారుచేసిన రాగి చెంబు ఉందని రియల్టర్ కిరణ్కి తెలిపాడు. అంతేకాదు కిరణ్ను నమ్మించేందుకు విజయ్, అతని బామ్మర్ధి సంతోష్, ఐటీ ఉద్యోగి సాయి భరద్వాజ్, మౌలాలికి చెందిన సురేంద్రతో కలిసి నాటకం ఆడాడు. శాటిలైట్స్, అణ్వాయుధాల వినియోగంలో ఈ పాత్ర వాడుతారని, నాసా, ఇస్రో వాళ్లు కోట్ల రూపాయలు వెచ్చించి కొంటారని నమ్మ బలికాడు.
అద్భుత శక్తులు, మహిమగల రాగి చెంబును రూ. 3 కోట్లకు విక్రయిస్తామని రియల్టర్ కిరణ్ను నమ్మించాడు విజయ్కుమార్. దాంతో కిరణ్ ఇది నిజమేనని నమ్మి.. మొదటి విడతగా రూ. 50 లక్షలు ఇచ్చాడు. రెండోవిత రూ. 90 లక్షలు, ఆ తర్వాత రూ. 12 లక్షలు, మరోవిడత రూ. 1.30 కోట్లు.. ఇలా 6 నెలల్లో విడతలవారీగా మొత్తం రూ. 3 కోట్లు విజయ్కి ఇచ్చాడు రియల్టర్ కిరణ్. అయితే చివరకు రాగి చెంబు ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కిరణ్.
రియల్టర్ కిరణ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ స్పెషల్ క్రైమ్ పోలీసులు బృందం నిఘా పెట్టింది. విజయ్కుమార్ ముఠాను అదుపులోకి తీసుకుంది. విజయ్తోపాటు అతనికి సహకరించిన సాయి భరద్వాజ్, సంతోష్, సురేందర్లను అరెస్టు చేసి విచారిస్తోంది. పలువురు వ్యాపారుల నుంచి దాదాపు రూ. 20 కోట్లపైనే దోచేసి ఉంటారని తెలుస్తోంది.
Rice Pulling Scam
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..