
హైదరాబాద్, డిసెంబర్ 14: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేషన్కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి కాని యూనిట్లకు ఈకేవైసీ పూర్తి చేయకుంటే రేషన్ కోటా నిలిపివేస్తామని ఇప్పటికే అధికారులు పలుమార్లు హెచ్చరించినా జనాలు నిర్లక్ష్యం వీడటం లేదు. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఆప్డేట్ చేయించుకోవాలి. రేషన్ కార్డు సభ్యులు ఈ-కేవైసీ చేసుకుంటేనే రేషన్ అందిస్తామని, లేదంటే వారందరికీ రేషన్ ఆపివేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రేషన్ కార్డుల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
రెండేండ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా వినియోగదారులు పూర్తి స్థాయిలో అప్డేట్ చేసుకోవడం లేదు. ఈ క్రమంలో డిసెంబర్ 31వ తేదీలోపు మిగిలిన వారంతా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటన వెలువరించారు. ఈలోపు ఈకేవైసీ చేయించుకోని వారందరికీ రేషన్ కోటా ఉండదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ పరిణామం ఎలా ఉంటుందోనన్న ఆందోళన అటు రేషన్ డీలర్లు, ఇటు జనాలకు మొదలైంది. దీంతో డిసెంబర్ 31 వరకు ముగింపు గడువు కాకుండా మరింత పెంచాలని రేషన్ కార్డుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు కొందరివి నమోదు కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ-పాస్ యంత్రంలో నమోదు కాకుంటే తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మంజూరు చేసిన రేషన్కార్డుదారులకు ఇంకా సంక్షేమ పథకాలను మంజూరు చేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పాత రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యంతో పాటు వంటగ్యాస్, గృహజ్యోతి, ఉచిత కరెంట్ అందిస్తున్నారు. అయితే కొత్త కార్డులు పొందిన వారికి మాత్రం ఈ పథకాలు అందడం లేదు. కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందించేలా చూడాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.