
రెండు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణకు వర్షసూచన జారీ చేసింది. నిన్న గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర ఒడిశా పరిసరాలలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ ,తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంటుంది. ఇది సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతానికి కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ఆదివారం ఏర్పడినట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.
ఈ రోజు,రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తన వెదర్ బులిటెన్లో అంచనా వేసింది. రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు అక్కడక్కడ కురుస్తాయని స్పష్టం చేసింది.
దక్షిణ అంతర కర్ణాటక, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో ఏపీలో కూడా మూడ్రోజుల పాటు వానలు కురవనున్నాయి. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది.ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయని హెచ్చరించింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదని పేర్కొంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలతో పాటు వర్షాలు కూడా ఆకస్మాత్తుగా కురుస్తున్నాయి. రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెట్ల కింద ఉండవద్దని, కరెంట్ స్తంభాలను తాకవద్దని సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.