
హైదరాబాద్, ఫిబ్రవరి 02: బండ్ల గణేశ్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈయన ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే. చిన్న కమెడియన్ నుంచి ప్రముఖ టాలీవుడ్ నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. బండ్ల గణేష్ ఫిబ్రవరి 2న శుక్రవారం గాంధీభవన్లో మల్కాజిగిరి లోక్సభ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనియాడారు.
మల్కాజ్గిరి నియోజకవర్గం విషయానికొస్తే.. 2019 నాటికి 31,50,303 మంది ఓటర్ల సంఖ్యతో మల్కాజిగిరి అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా స్థాయిని పెంచుకుంది. 2014-2019 వరకు ఎంపీగా మల్లా రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కొనసాగారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రేవంత్రెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం తెలంగాణలోనే ఒక ముఖ్యమైన రాజకీయ యుద్ధభూమిగా ఉంది. పెద్ద సంఖ్యలో విద్యావంతులు, మధ్యతరగతి ఓటర్లు ఉన్నందున వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ అభ్యర్థలను ఆకర్షిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ రానున్న లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్లను జనవరి 30న విడుదల చేసింది. దరఖాస్తులను మార్చి 3 వరకు పరిశీలిస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పరిధిలో ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కోరుతూ పలువురు పార్టీ నేతలు ఇప్పటికే దరఖాస్తులు గాంధీభవన్లో సమర్పించారు. రాజ్యసభ అభ్యర్థులను కూడా ఖరారు చేసేందుకు పార్టీ హైకమాండ్కు అధికారం ఇస్తూ టీపీసీసీ తీర్మానం చేసింది. బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..