బండి సంజయ్ కు నోటీసులిచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. విచారణకు రావాలని ఆదేశం

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బండి సంజయ్ కు నోటీసులిచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. విచారణకు రావాలని ఆదేశం
Bandi Sanjay, Kavitha

Updated on: Mar 19, 2023 | 1:35 PM

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌పై ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు. ఇక, ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూడా బండి సంజయ్‌పై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవలే ఫిర్యాదు చేశారు. అలాగే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్ అయింది. ఆయన చేసిన కామెంట్స్ పై రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ సుమోటోగా స్వీక‌రించడం.. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే దీనిపై తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు బండిసంజయ్ కు నోటీసులు పంపారు. రేపు తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించారు. ఇటీవల కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ బండి సంజయ్ కామెంట్ చేయడం తీవ్ర దుమారం రేపింది . ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..