
ఏడు పదుల వయసు దాటినా ఆ పెద్దాయనలో పటుత్వం తగ్గలేదు… మనవళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో ఆటల్లో సత్తా చూపిస్తున్నాడు. పరుగు పందాల్లో చిరుతలా పరిగెడుతూ పతకాల పంట పండిస్తున్నాడు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్దులు అన్న ఓ సినీ కవి పదాలను తిరగరాస్తూ నేటి తరం వృద్దులు పట్టుదలతో అవుతారు యువకులు… అంటూ నేతి తరానికి సవాల్ విసురుతున్నాడు
వయసు మళ్లిన యువకుడు నాగయ్య…
బాపట్ల జిల్లా పేరాలకు చెందిన పంభా నాగయ్య వయసు 75 ఏళ్లు. ఈయనే మన కథలో నవయువకుడు… నాగయ్య వయసులో ఉండగా క్రీడల పట్ల ఆసక్తితో సాధన చేసి క్రీడాకారుడు అయ్యాడు. అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ తరువాత పేదరికం కారణంగా జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనలేకపోయాడు. అంతటితో తన క్రీడాశక్తిని పక్కన పెట్టి.. పెళ్లి చేసుకుని సంసార జీవితంలో అడుగుపెట్టాడు… పిల్లల్ని చదివిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా క్రీడలను ప్రాక్టీస్ చేసేవాడు… ఇక పిల్లలు పెద్దవాళ్లయి.. పెళ్ళిళ్లు చేసుకుని ఎవరి జీవితాలు వారు జీవిస్తుండటంతో తనకు తీరిక దొరికింది. దీంతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రోజూ గ్రౌండ్కు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న నాగయ్యలో ఉన్న ఉత్సాహాన్ని కాలేజిలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న విజ్ఞాన్కుమార్ గమనించారు. నాగయ్య వయస్సు వారు పాల్గొనే మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల గురించి తెలియచేశారు. దీంతో నాగయ్యలో మునుపటి ఉత్సాహం ఉరకలేసింది. 50 ఏళ్ల వయస్సులో ఉండగా తొలిసారి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇక అక్కడి నుంచి గత 25 ఏళ్ళుగా మాస్టర్ అథ్లెటిక్స్లో పాల్గొంటూనే ఉన్నాడు… పలు విభాగాల్లో వయస్సువారీగా పోటీల్లో పాల్గొని పతకాల పంట పండిస్తున్నాడు… లాంగ్ జంప్, పరుగు పందెంలలో పాల్గొంటున్నాడు. పరుగు పందేల్లో 1500 మీటర్లు, 800 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో జాతీయస్థాయి పోటీల్లో ఇప్పటికు 15 సార్లు పాల్గొన్నాడు. సెకడ్ ఇన్నింగ్స్లో వివిధ స్థాయి పోటీల్లో ఇప్పటి వరకు 25 బంగారు, 15 వెండి, 5 కాంస్య పతకాలు సొంతం సాధించి యువకులకు స్పూర్తిగా నిలుస్తున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..