Telangana: పాపం ఈ వయస్సులో తాతకు ఎంత కష్టం.. భార్య కోసం కాళ్లరిగేలా వెతుకులాట.. ఇంతలో ఇదేం ట్విస్ట్..

తన భార్య కోసం వెతుకుతున్న వృద్దుడిని ఇద్దరు అపరిచితులు మోసం చేశారు. వృద్దుడి దగ్గర ఉన్న పించన్ డబ్బులను చోరీ చేశారు. దీనిపై వృద్దుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మానసిక స్థితి బాలేక వృద్దుడి భార్య కనిపించకుండా పోయినట్లు తేలింది.

Telangana: పాపం ఈ వయస్సులో తాతకు ఎంత కష్టం.. భార్య కోసం కాళ్లరిగేలా వెతుకులాట.. ఇంతలో ఇదేం ట్విస్ట్..
Khammam

Edited By:

Updated on: Aug 28, 2026 | 9:26 PM

అసలే తన భార్య తప్పిపోయి ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. తన వయస్సు సహకరించకపోయినా దారిన వెళ్తున్న అందరిని అడుగుతూ తిరుగుతున్నాడు ఆ వృద్ధుడు. ఇదే సమయంలో కేటుగాళ్లు వృద్ధుడుపై జాలి దయ ఏ మాత్రం లేకుండా మోసం చేశారు.. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో తప్పిపోయిన భార్య ఆచూకీ చూపిస్తామంటూ నమ్మించి ఓ వృద్ధుడి జేబులో ఉన్న రూ.2 వేల నగదును ఇద్దరు అపరిచితులు అపహరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తల్లాడకు చెందిన బాధితుడు జక్కల ఎల్లయ్య (85) సుమారు 11 గంటల సమయంలో ఎస్బిఐ సర్వీస్ పాయింట్ వద్ద రూ.2 వేల ఆసరా పెన్షన్ తీసుకున్నాడు. అనంతరం పొగాకు కోనుగోలు చేసేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లి రోడ్డు పక్కన నిల్చున్నారు. అదే సమయంలో ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు ఆయనను పలకరించారు. తాతా… ఏంటి అటూ ఇటూ చూస్తున్నావు అని ప్రశ్నించారు. తన భార్య కనిపించకుండా పోయిందని పెద్దయ్య చెప్పడంతో..  అమ్మమ్మ అక్కడే ఉంది రా.. చూపిస్తాం ..అంటూ అతడిని నమ్మించారు. అనంతరం బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తల్లాడలోని ఓ కార్యాలయం సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఎల్లయ్యను ఆటో నుంచి దించి, ఇక్కడ కూర్చో.. నీకు టిఫిన్ తీసుకుని వస్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. చాలాసేపు వేచి చూసినా వారు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఎల్లయ్య తన జేబును పరిశీలించగా.. అందులో ఉంచుకున్న రూ.2 వేల నగదు కనిపించలేదు. దీంతో ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తులే తన జేబులోని నగదును కాజేసి ఉంటారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తల్లాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

భార్య కోసం వెతుకుతున్న వృద్ధుడి భార్యకు మానసిక స్థితి సరిగా లేక సుమారు రెండు నెలల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిసింది. అప్పటి నుండి ఆమె కోసం వెతుకుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. భార్య ఆచూకీ కోసం ఆందోళనతో ఉన్న వృద్ధుడిని ఇద్దరు యువకులు పథకం ప్రకారం నమ్మించి మోసం చేసి, నడి రోడ్డుపై జీవనోపాధికి ఆధారమైన ఆసరా పెన్షన్ నగదును కాజేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులూ, ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us