Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. మూసీ ప్రాజెక్టుకు ప్రభుత్వం భూసేకరణను ప్రారంభించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తొలిదశలో హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు భూములు సేకరించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 50 ఎకరాలకు పైగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. భూ యజమానులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ను కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఫేజ్ A1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు అధికారులు.
గోల్కొండ మండలం, గండిపేట మండలం పరిధిలో భూముల సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసి అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగనున్నాయి. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో, 14 మండలాలు, 46 గ్రామాల్లో మూసీ అభివృద్ధి జరగనుంది.
భూ యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా యజమానులు పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు నిర్దేశిత సమయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏమైనా అభ్యంతరాలంటే నిర్ణీత సమయంలో తెలియజేయాలని అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
