Harish Rao: ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకే అగ్నిపథ్.. మోడీ సర్కార్‌పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం..

|

Jun 18, 2022 | 2:30 PM

మంత్రి హరీష్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు, జీవిత బీమా సంస్థల తరహాలోనే రక్షణ రంగంలోనూ కేంద్రం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందంటూ పేర్కొన్నారు.

Harish Rao: ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకే అగ్నిపథ్.. మోడీ సర్కార్‌పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం..
Harish Rao
Follow us on

Minister Harish Rao on Modi govt: ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తెచ్చిన ఈ అసంబద్ధ పథకం వల్లే దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయంటూ హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్, భీంగల్, మోర్తాడ్ మండలాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు, జీవిత బీమా సంస్థల తరహాలోనే రక్షణ రంగంలోనూ కేంద్రం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందంటూ పేర్కొన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ సికింద్రాబాదులో యువత ఆందోళనకు దిగిన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడం దురదృష్టకరమన్నారు.

ఈ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని బీజేపీ నాయకులు పేర్కొనడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. సికింద్రాబాద్‌లో ఆందోళన వెనుక టిఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉంటే, మరి బీహార్, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అల్లర్ల వెనుక సీఎంలు నితీష్ కుమార్‌, యోగి ఆదిత్యనాథ్‌ల హస్తం ఉందా అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగితే, ఈ పథకాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేదు అంటూ కేంద్రం బుకాయించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని భావిస్తున్న యువతకు, నాలుగేళ్ల తర్వాత ఆర్మీ ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి భవిష్యత్తు ఏం కావాలని హరీష్ రావు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏ రంగంలో చూసినా మోడీ ప్రభుత్వానివి మాటలు తీయగా, చేతలు చేదుగా ఉన్నాయని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, గడిచిన ఎనిమిది ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అచ్చే దిన్ కేవలం నోటిమాటకే పరిమితమైందని, ఏ ఒక్క హామీని మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకాన్ని మోసానికి గురి చేసిన కేంద్ర ప్రభుత్వం, విదేశాల నుండి నల్లధనాన్ని వెనక్కి తెస్తామని నయాపైసా కూడా తేలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల ఖాతాల్లో జమ చేస్తామన్న 16 లక్షల రూపాయల నగదు ఎక్కడ అని ప్రశ్నించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం… తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు మొండి చేయి చూపి మన రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న మోడీ ప్రభుత్వం, ఝూటా మాటలతో కాలం వెళ్లదీస్తోందని తూర్పారాబట్టారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ అభివృద్ధి పథకాలు కొడిగడతాయని, బోర్లకు మీటర్లు పెట్టి దోచుకుంటారని హరీష్ రావు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని నిలుపుకున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న రెండు వేల రూపాయల పెన్షన్, సేద్యానికి 24 గంటల విద్యుత్, ఇంటింటికి రక్షిత మంచి నీరు, రైతు బంధు, దళిత బంధు వంటి ఏ ఒక్క పథకం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మచ్చుకైనా కానరావని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి సంక్షేమాభివృద్ధి పాటుపడే తెరాసకు మద్దతుగా నిలవాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..