MLC Kavitha: కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే హరీశ్‌ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. హరీశ్, సంతోష్ వల్లనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయన్నారు. వారిద్దరి వెనక సీఎం రేవంత్ ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha: కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..
Mlc Kavitha Sensational Comments On Harish Rao

Updated on: Sep 01, 2025 | 6:20 PM

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే హరీశ్‌ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. హరీశ్, సంతోష్ వల్లేనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారన్నారు. వారిద్దరి వెనక సీఎం రేవంత్ ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం దారుణమన్నారు. దమ్ముంటే హరీష్‌, సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా.. కానీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై సీబీఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంతని కవిత అన్నారు.

కేసీఆర్‌పై విచారణ అంటే తెలంగాణ బంద్‌కు బీఆర్ఎస్ ఎందుకు పిలుపునివ్వలేదని కవిత ప్రశ్నించారు. ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి.. కానీ పార్టీ సైలెంట్‌ ఉండటం దారుణమన్ఆనరు. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి ఇద్దరు ముగ్గురు నేతలు కారణమని.. వారి ఆస్తులు పెంచుకోవడానికి ఇలా చేశారని అన్నారు. ”నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు.. నష్టం జరిగినా సరే మాట్లాడుతున్నా. ఇద్దరు ఇరిగేషన్ అధికారుల దగ్గర వందల కోట్లు దొరికాయి. వారి వెనక ఎవరున్నారో తేల్చాలి. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. పార్టీ ఓటమికి కేసీఆర్ వెంట ఉన్నవాళ్లే కారణం” అని కవిత అన్నారు.

బీఆర్ఎస్ కౌంటర్

కాగా కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించింది. హరీశ్ ఆరు అడుగుల బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా బీఆర్ఎస్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పీఆర్వోను తొలగించారు. మరోవైపు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు కీలక నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..