Hyderabad: జ్యూస్ సెంటర్లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
చిన్నపాటి వాగ్వాదం.. క్షణికావేశం.. వెరసి ఒక నిండు ప్రాణం బలైపోయింది. హైదరాబాద్లోని టోలిచౌకిలో అర్ధరాత్రి వేళ ఓ జ్యూస్ సెంటర్లో పనిచేసే ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ హత్యకు దారితీసింది. సర్వింగ్ బాయ్గా పనిచేస్తున్న 17 ఏళ్ల బాలుడిని తన తోటి కార్మికుడే గరిటతో తలపై కొట్టి చంపడం నగరంలో సంచలనంగా మారింది.

హైదరాబాద్లో మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో జరిగిన చిన్న గొడవ ఎంత పెద్ద విషాదానికి దారితీసింది. ఫలితంగా ఒక మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. జ్యూస్ పాయింట్లో పని చేస్తున్న ఇద్దరు యువకుల మధ్య మొదలైన వివాదం మాటామాటా పెరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. టోలిచౌకిలో ఉన్న నైస్ జ్యూస్ పాయింట్లో అలం (17) అనే మైనర్ బాలుడు సర్వింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అలంకు, అక్కడ పనిచేస్తున్న మరో సహచరుడికి మధ్య చిన్న విషయంలో మాటామాటా పెరిగింది. ఈ వాగ్వాదం కాస్తా తీవ్ర వివాదంగా మారింది.
గరిటతో తలపై దాడి.. అక్కడికక్కడే మృతి
వివాదం ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు, దుకాణంలో జ్యూస్ కోసం ఉపయోగించే ఇనుప గరిటతో అలం తలపై బలంగా బాదాడు. దెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అలం రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు, చుట్టుపక్కల వారు స్పందించే లోపే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల రంగప్రవేశం
సమాచారం అందుకున్న వెంటనే మెహదీపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిన్నపాటి ఘర్షణే ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో టోలిచౌకి ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
