
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీ.. దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రమైన కర్నాటకపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ జనతాదళ్-ఎస్ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంత్రులందరూ విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటారన్నారు. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ఆమె వెల్లడించారు. జేడీఎస్ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ కామెంట్లు చేశారు. డబుల్ ఇంజిన్ పాలన అంటూ గొప్పలు చెప్పే బీజేపీ కర్నాటకలో మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెలంగాణలో రూ. 2016 పింఛన్ ఇస్తుంటే కర్ణాటకలో మాత్రం రూ. 600 ఇస్తున్నారని ఆక్షేపించారు.
కాగా.. తెలంగాణలో వరసగా రెండు సార్లు అధికారం చేపట్టిన టీఆర్ఎస్.. 8 ఏళ్ల తర్వాత భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయింది. BRS నూతన జెండాను ఆవిష్కరించారు కేసీఆర్. గులాబీ జెండా మధ్యలో భారతదేశం మ్యాప్ ఉంది. పార్టీ పేరు, జెండా మారినప్పటికీ కారు గుర్తుమాత్రం కొనసాగనుంది. బీజేపీని నేరుగా ఢీ కొట్టేందుకు సై అంటున్నారు కేసీఆర్.! దేశం మారాలి. అది తెలంగాణ నుంచే మొదలవ్వాలని దాదాపు ప్రతి మీటింగ్లోనూ చెబుతున్నారు..! ఇప్పటికే పలు పార్టీల జాతీయ నేతలతోనూ ఆయన సమావేశం అయ్యారు.
మరోవైపు.. 2023 లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇకపై కేసీఆర్ అడుగులు ఉంటాయని చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. బీఆర్ఎస్ తొలి టార్గెట్ కర్నాటక ఎన్నికలు. 2023 మేలోపు ఈ ఎన్నికలు జరుగుతాయి. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో జేడీఎస్ తో కలిసి పోటీ చేయనుంది బీఆర్ఎస్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..