Telangana: పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం.. 40వేల మందితో సమావేశం

| Edited By: Jyothi Gadda

Jan 24, 2024 | 9:29 PM

పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షలు చేసిన కాంగ్రెస్ భారీ మీటింగ్ కోసం ప్లాన్ చేసింది. గురువారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బూత్ కన్వీనర్లు హజరవనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా రానున్నారు.

Telangana: పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం..  40వేల మందితో సమావేశం
Congress Party
Follow us on

పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా వ్యూహాన్ని రచిస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అధిష్టానం పూర్తిస్థాయిలో ఇక్కడ ఫోకస్ చేస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా అధిష్టానం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్‌మేనేజ్‌మెంట్‌పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజక వర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

మరోవైపు రాష్ట్ర ఇంచార్జీ మున్షీ సైతం ఈ మీటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత రెండు రోజులుగా గాంధీ భవన్‌లో పలు సామాజిక వర్గాల నేతలతో ఈ కార్యక్రమం సక్సెస్ కోసం ఏం చేయాలనే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీనియర్ నేతలు హాజరై లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలు నిర్ణీత సమయంలో కాకుండా ముందే జరగొచ్చన్న అంచనాలతో ఎప్పుడు ఎన్నికలు జరిగిన సిద్ధంగా ఉండేలా పార్టీ నాయకత్వం శ్రేణుల్ని సిద్దం చేస్తోంది. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన అధిష్టానం నియమించింది

పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 15 సీట్లు గెలవాలని కసరత్తు చెస్తోన్న కాంగ్రెస్‌ నాయకత్వం ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది. లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపే లక్ష్యంగా నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కమిటీ సమావేశానికి బూత్ సాయి ఏజెంట్లు అందరూ హాజరుకావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న 36 వేల మంది బూత్ స్థాయి కన్వీనర్లు హాజరు కానున్నారు.

ఇవి కూడా చదవండి

బూత్ స్థాయి ఎజెంట్లతో స్వయానా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సమావేశం కానుండడంతో ఈ సమావేశం కేడర్లో ఉత్సాహం నింపుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మొన్న ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేసిన బూత్ కన్వీనర్లు ఖర్గే మీటింగ్ తర్వాత మరింత ఉత్సాహంగా పనిచేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మెజారిటీ సీట్లు గెలవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరిన్ని పొలిటికల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..