
మెదక్ జిల్లా కౌడిపల్లిలోని గిరిజన గురుకుల కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పే మహిళా లెక్చరర్కే రక్షణ కరువైంది. గత ఆరు నెలలుగా ఓ కిరాతకుడు ఆమెను మానసికంగా వేధిస్తూ, చివరకు కాలేజీలోనే ఆమెపై భౌతిక దాడికి తెగబడ్డాడు. క్యాటరింగ్ కాంట్రాక్టర్ కుమారుడి ఆగడాలపై బాధితురాలు కౌడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కౌడిపల్లి (మం) కేంద్రంలోని గిరిజన గురుకుల మహిళా కళాశాలలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న తన తండ్రి అండాతో రమేష్ అనే యువకుడు రెచ్చిపోయాడు. ఆ కాలేజ్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా లెక్చరర్పై కన్నేసిన రమేష్.. ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి, నిరంతరం డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకరమైన మెసేజ్లు చేయడం స్టార్ట్ చేశాడు. దాదాపు గత 6 నెలలుగా ఇలానే ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశాడు.
రమేష్ ప్రవర్తన పై పలు మార్లు హెచ్చరించినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా అతని వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోయాయి..ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన రమేష్ ఏకంగా గురుకుల కాలేజీ ప్రాంగణంలోకి చొరబడి.. ఒంటరిగా ఉన్న లెక్చరర్ను భయబ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా అందరి ముందే ఆమె చెంప పై బలంగా కొట్టి దౌర్జన్యానికి దిగాడు.. కాలేజీలోనే లెక్చరర్ పై దాడి జరగడంతో గురుకులంలో తీవ్ర కలకలం రేగింది.
ఇక రమేష్ వేధింపులు, దాడి పై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధిత మహిళా లెక్చరర్.. చివరకు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లెక్చరర్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడు రమేష్పై కేసు నమోదు చేశారు. మహిళా లెక్చరర్కు రక్షణ కల్పించడంతో పాటు, నిందితుడిని కఠినంగా శిక్షించాలని తోటి ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.