
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2025లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు వివిధ రాష్ట్రాల నుంచి 45 మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో సూర్యాపేట జిల్లాకు చెందిన మారం పవిత్రను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మారం పవిత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. మారం పవిత్ర 2023లోనూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు రావడంపై మారం పవిత్ర సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందని ఆమె తెలిపారు. సూర్యాపేట జిల్లాకు కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.