
మంథనిలో మరోసారి గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు. 31380 ఓట్ల భారీ మెజార్టీతో విజయం కేతనం ఎగరేశారు. శ్రీధర్ బాబుకు 103822 ఓట్లు పోలవ్వగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు 72442 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి సునీల్ రెడ్డికి కేవలం 5779 ఓట్లు మాత్రమే వచ్చాయి.
మంథని..రాష్ట్రంలోనే అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఒకటి. స్వాతంత్రోద్యమ చరిత్రలో సాయుధ పోరుకు శ్రీకారం చుట్టిన గుల్కొట శ్రీరాములును తొలిసారి అసెంబ్లీకి పంపించారు మంథని (Manthani Assembly Election) ఓటర్లు. ఆ తరువాత స్థానికేతరుడే అయినా స్వాతంత్య్ర పోరాటంతో ఉన్న అనుబంధంతో మంథని రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన పీవీ నరసింహరావును 1957 నుండి 1972 వరసగా నాలుగు సార్లు గెలిపించి చరిత్ర సృష్టించారు ఇక్కడి ప్రజలు. ఆ తరువాత చందుపట్ల నారాయణరెడ్డి కాంగ్రెస్ నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించగా, 1983 నుండి 1989 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీపాదరావు గెలిచి హ్యట్రిక్ కొట్టారు. 1994లో టీడీపీ తరుపున చందుపట్ల రాంరెడ్డి గెలవగా, 1999 నుండి 2009 వరకు వరుసగా మూడుసార్లు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ గెలవగా, 2018 ఎన్నికల్లో శ్రీధర్బాబు గెలిచారు. తాజాగా మరోసారి శ్రీదర్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
మంథని చరిత్రలో అరుదైన రికార్డును ప్రస్తుత ప్రధాన పార్టీల అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. నాలుగుసార్లు వీరిద్దరే అభ్యర్థులుగా మంథని బరిలో నిలిచారు. 2009లో మంథని నుండి శ్రీధర్బాబు, పుట్ట మధులు పోటీ పడుతున్నారు. 2009లో పుట్ట మధు పీఆర్పీ తరుపున పోటీ చేయగా, 2014 నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబుతో తలపడుతున్నారు. 2014లో శ్రీధర్ బాబును ఓడించిన పుట్ట మధు 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రెండు దశాబ్దాలుగా ఇద్దరు అభ్యర్థుల మధ్యే పోటి నెలకనడం మంథని చరిత్రలో అరుదైన సంఘటనేనని చెప్పవచ్చు.
అయితే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. మంథని నుండి ఆరు సార్లు పోటీ చేసిన క్రెడిట్ ఆయన ఖాతాలోనే చేరింది. 1999లో ఆయన తండ్రి శ్రీపాదరావు హత్య తరువాత రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు 1999 నుండి ఇక్కడి పోటీ చేస్తున్నారు. ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా మరోసారి గెలుపొందారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్