Telangana: రూ.10 నాణేల బస్తాతో బైక్ షోరూంకు వ్యక్తి.. అతను చెప్పింది విని సిబ్బంది షాక్

సాధారణంగా ఎవరైనా కొత్త బైక్ కొనాలంటే నెట్ బ్యాంకింగ్, చెక్కులు లేదా కరెన్సీ నోట్లతో చెల్లిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించారు. తన కలల బైక్ 'స్ప్లెండర్ ప్లస్' సొంతం చేసుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: రూ.10 నాణేల బస్తాతో బైక్ షోరూంకు వ్యక్తి.. అతను చెప్పింది విని సిబ్బంది షాక్
Rs 10 Coins

Edited By:

Updated on: Jul 08, 2026 | 11:09 AM

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి.. ఎంతో కాలంగా తనకు ఇష్టమైన బైక్ కొనుగోలు చేయాలని భావించాడు. రఘుపతి ఇందుకోసం పొదుపు చేయడం ప్రారంభించాడు. ప్రత్యేకంగా చాలా కాలంగా పది రూపాయల నాణేలను పొదుపు చేస్తూ వచ్చారు. ఆ నాణేలన్నీ కలిసి ఇప్పుడు ఒక చిన్నపాటి సంపదలా మారాయి. తాను ఎంతో ఇష్టంగా కొనుక్కోవాలనుకున్న బైక్ ధర రూ. 1.10 లక్షలు కాగా, ఆ మొత్తాన్ని నోట్ల రూపంలో కాకుండా, పూర్తిగా కేవలం రూ. 10 కాయిన్ల రూపంలోనే చెల్లించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

చిట్యాలలోని శ్రీ వినాయక మోటార్స్‌కు రఘుపతి పెద్ద పెద్ద సంచులతో వెళ్లారు. రూ.1.10 లక్షలు విలువైన స్ప్లెండర్ ప్లస్ బైక్ కావాలని అడిగాడు. అయితే ఆ మొత్తాన్ని నోట్ల రూపంలో కాకుండా తన వెంట తెచ్చిన సంచులను సిబ్బందికి ఇచ్చాడు. సిబ్బంది మొదట ఆ సంచులను చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కో సంచిలో నిండుగా ఉన్న పది రూపాయల కాయిన్లు.. సిబ్బంది గంటల పాటు కూర్చొని ఒక్కో కాయిన్‌ను లెక్కించారు. మొత్తం రూ.1.10 లక్షలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న షోరూమ్‌ మేనేజర్.. రఘుపతికి కొత్త స్పెండర్ ప్లస్ బైక్‌ను అందజేశారు. రఘుపతి మాత్రం తాను చాలాకాలంగా వివిధ వ్యాపారాల ద్వారా వచ్చిన రూ.10 కాయిన్లను దాచుకుంటూ వచ్చానని, వాటితోనే తన కలల బైక్ కొనాలని ముందే నిర్ణయించుకున్నానని తెలిపాడు.

కాయిన్లతో బైక్ కొని, స్థానికుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, పొదుపు పట్ల తనకున్న చిత్తశుద్ధిని రఘుపతి చాటి చెప్పారు. చిన్న మొత్తాలైనా సరే.. క్రమశిక్షణతో కూడితే పెద్ద లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చో రఘుపతి ఉదంతం నిరూపించింది. కాయిన్లతో బైక్ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసి షోరూమ్ వద్ద స్థానికులు భారీగా గుమిగూడారు. “ఇంత పెద్ద మొత్తాన్ని కాయిన్ల రూపంలో చెల్లించడం ఇదే తొలిసారి చూస్తున్నాం” అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us