
హైదరాబాద్లో పౌర విమానయాన పరిశోధనా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంస్థను ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4,5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని టూర్కు సంబంధించిన షెడ్యూల్ సైతం ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి. మార్చ 5వ తేదీన మోదీ ఈ సెంటర్ను ప్రారంభిస్తారు.
ఈ విషయమై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తోన్న మరో బహుమతి ఈ సెంటర్ అని కిషన్ రెడ్డి అన్నారు. సివిల్ ఏవియేషన్ రంగంలో సరికొత్త టెక్నాలజీకి ఈ సెంటర్ నాంది పలుకుతుందని కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశంలో ‘గ్రిహ-5’ ప్రమాణాలతో నిర్మించిన తొలి సెంటర్ ఇదేనన్నారు.
ఈ సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెంటర్ ద్వారా ఏయిర్ నావిగేషన్ సర్వీసెస్కు అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సదుపాయాలను అందిస్తారు. ఈ సెంటర్లో నెట్వర్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్, డేటా మేనేజ్మెంట్ సెంటర్, సైబర్ సెక్యూరిటీ అండ్ థ్రెట్ అనలసీస్ ల్యాబ్స్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. తెలంగాణలో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..