Telangana LS Polls: ఆ లోక్ సభ సీటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్, మాజీ చైర్మన్ బరిలోకి..!

| Edited By: Janardhan Veluru

Feb 13, 2024 | 1:31 PM

త్వరలో 2024 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. మొత్తం 17 స్థానాలు ఉండగా, సగానికి సగంపైన సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ తమ అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తుండగా, రేపోమాపో బీజేపీ సైతం అభ్యర్థులను ప్రకటించనుంది.

Telangana LS Polls: ఆ లోక్ సభ సీటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్, మాజీ చైర్మన్ బరిలోకి..!
KCR
Follow us on

త్వరలో 2024 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. మొత్తం 17 స్థానాలు ఉండగా, సగానికి సగంపైన సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ తమ అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తుండగా, రేపోమాపో బీజేపీ సైతం అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మోడ్ లోకి వెళ్లిపోయారు. అటు కాంగ్రెస్, అటు బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉండటంతో ఆయన చాకచాక్యంగా ముందుకు సాగుతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే నియోజకవర్గాల వారిగా కీలక నేతలతో సమావేశాలు, సభలు నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలపై ఓ కొలిక్కి వచ్చారు.

అయితే వివిధ వర్గాల సమాచారం ప్రకారం.. బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అయితే ఆయన మనసు మార్చుకుని గజ్వేల్‌కు చెందిన తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎఫ్‌డీసీ) మాజీ చైర్మన్ వీ ప్రతాప్ రెడ్డిని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. మెదక్ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించిన రెడ్డితో బీఆర్‌ఎస్ అధినేత ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రతాప్ రెడ్డిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కేసీఆర్, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ కంచుకోటలుగా పరిగణించబడుతున్న ఈ నియోజకవర్గాలు కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా మరోవైపు ఈ మెదక్ సీటుపై కాంగ్రెస్ నేతలు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు సైతం పోటీకి దిగాలని లాబీయింగ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు ఓడిపోవడంతో ఎలాగైనా ఎంపీగా గెలువాలని నిర్ణయించుకున్నారు. అయితే తన కుమారుడు మైనంపల్లి రోహిత్ గెలవడం హన్మంతరావుకు కలిసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.