
యాదృచ్చికమో..? లేక పాలకుల ప్రయోగమో..! ఏమో కానీ.. ఆ జిల్లా సారధులంతా అతివలే. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజా ప్రతి నిధులు, ఉన్నతాధికారులలో 80 శాతం మహిళలే సారథులు. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆ నారీమణులు పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. ఇది పాలకుల ప్రయోగమా..? అని సందేహం కలుగుతోంది. ఆ జిల్లాలో అతివల పాలన ఎలా కొనసాగుతుంది..? మహిళల సారధ్యంలో ఆ జిల్లా ప్రగతిపథం వైపు అడుగులు వేస్తుంది..!
పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇప్పుడు మరో చారిత్రక పరిపాలనకు వేదికైంది. రాణీ రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అతివలు పరిపాలనలో స్త్రీ శక్తిని చాటుతున్నారు. బహుశా దేశంలో ఏ జిల్లాకు లేని ఓ చరిత్ర ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సొంతం చేసుకుంది. ఇక్కడ అంతా అతివలే సారథులు. అధికారులు, ప్రజాప్రతినిధులలో 80 శాతం మహిళలే..!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు దక్కగా, ఆ ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. ఈ ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్లు పేరుంది. ఇప్పుడు ఆ ఇద్దరూ రాష్ట్రంలోనే స్పెషల్ అట్రాక్షన్గా మారారు. పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుండి సీతక్క, సురేఖ, యశస్విని రెడ్డి ముగ్గురు మహిళలు గెలుపొందగా ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్ లు మంత్రులయ్యారు. 26 ఏళ్ల అతిచిన్న వయస్సులో MLA అయిన యశస్వినిరెడ్డి అసెoబ్లీలో స్పెషల్ గా మారారు. ఇక తెలంగాణలో రెండో అతి పెద్ద నగరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం ఆరు జిల్లాలు ఉన్నాయి.. వాటిలో మూడు జిల్లాల కలెక్టర్లు మహిళలే. వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్య రెడ్డి, హనుమకొండ కలెక్టర్ గా స్నిక్తా పట్నాయక్, ములుగు కలెక్టర్ ఇళా త్రిపాఠి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్లు ఐదుగురు మహిళా IAS అధికారులే కావడం విశేషం. మరోవైపు జిల్లా జడ్జి కూడా స్త్రీ మూర్తే కావడం మరో విశేషం. జస్టిస్ రాధాదేవి ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక, వరంగల్ TSRTC రీజనల్ మేనేజర్ కూడా మహిళే కావడం విశేషం. శ్రీలత ప్రస్తుతం RTC RM గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు..
మరోవైపు ఉమ్మడి వరంగల్ పరిధిలోని నాలుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్లుగా మహిళలే సారథ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా గండ్ర జ్యోతి, మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్గా హిమ బిందు, భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ గా శ్రీహర్షిని , ములుగు జెడ్పీ చైర్ పర్సన్గా బడే నాగజ్యోతి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్ళేకాదు మూడు జిల్లాల జెడ్పీ CEOలు, నాలుగు మున్సిపాలిటీ ల చైర్ పర్సన్లు కూడా మహిళలే కావడం విశేషం. మామునూర్ పోలిస్ ట్రైనింగ్ క్యాంప్ ప్రిన్సిపాల్గా పూజా IPS అధికారిని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి ప్రముఖులే కాదు.. స్థానిక సంస్థల్లోనూ మహిళలు వారి సత్తా చాటుతున్నారు. గ్రామాల్లో వారి మార్క్ ప్రదర్శిస్తున్నారు. ఇక ఉద్యోగులలోనూ మహిళలదే పైచేయి. వరంగల్ జిల్లాలో 2,306 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. హనుమకొండలో 3,213 మంది, ములుగు జిల్లాలో 1,124 మంది, జనగామ జిల్లాలో 1,185 మంది, మహబూబాబాద్ జిల్లాలో 2,040 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో1,075 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.
ఇందుగలరు అందు లేరను సందేహం వలదు అన్నట్లు.. అన్ని విబాగాలలో మహిళలే సారధులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిపాలనా పగ్గాలు వారి చెక్కు చేతుల్లో పెట్టుకొని నడిపిస్తున్నారు. రాణీ రుద్రమదేవి వారసత్వాన్ని చాటుతూ స్త్రీ శక్తిని చాటుతున్న ఈ నారీ మణులు అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తారని ఆశిద్దాం..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…