మండే ఎండల్లో రిలీఫ్ వచ్చేసింది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడతాయని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
జగిత్యాల, మహబూబాబాద్, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నారాయణ పేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ కూడా విడుదల చేశారు. ఇక హైదరాబాద్ పరిధిలో కూడా వర్షం పడే చాన్స్ ఉందని తెలిపారు. పగటివేళ ఎండలు ఉన్నప్పటికీ రాత్రి వేళ వర్షం పడుతుందని అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…