
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అత్యంత కీలక హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశముందని అంచనా వేసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నదులు, వాగులు పొంగిపొర్లుతున్న వేళ.. తాజాగా విడుదలైన ఈ హెచ్చరిక ఆ ప్రాంత ప్రజల్లో గుబులు రేపుతోంది.
అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులకు అప్రమత్తం చేయగా.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్, రవాణా, డ్రైనేజ్ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక అధికారులకు కలెక్టర్స్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.