Jagtial: ఎంతటి దౌర్భాగ్యం.. అనారోగ్యంతో ఉన్న భర్తను స్మశానంలో వదిలేసి వెళ్లిన భార్య..

జగిత్యాల గాంధీనగర్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన మానవత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తీవ్రమైన అనారోగ్యంతో ప్రాణాలతో పోరాడుతున్న ఎండ్రికాయల శ్రీధర్‌ను అతని భార్య స్మశానంలో వదిలేసి వెళ్లిపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న ఈ క్లిష్ట సమయంలో, స్థానికులు మాత్రం మానవత్వాన్ని చూపించి అతనిని ఆసుపత్రికి తరలించడం ఆశను కలిగించే అంశంగా నిలిచింది.

Jagtial: ఎంతటి దౌర్భాగ్యం.. అనారోగ్యంతో ఉన్న భర్తను స్మశానంలో వదిలేసి వెళ్లిన భార్య..
Sridhar

Edited By:

Updated on: Mar 20, 2026 | 4:59 PM

జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రతి మనసుని కలచివేస్తోంది. తీవ్ర అనారోగ్యంతో.. ప్రాణాలతో పోరాడుతున్న ఒక వ్యక్తిని అతని భార్య స్మశాన వాటికలో వదిలేసి వెళ్లిపోవడం మానవత్వానికే మచ్చే తెచ్చేలా ఉంది.  జగిత్యాలకి చెందిన ఎండ్రికాయల శ్రీధర్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు దెబ్బతినడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ విషమిస్తూ వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అయినవారి చేయూత, ఆదరణ ఎంతో అవసరం. కానీ శ్రీధర్‌కి అవన్నీ దక్కకపోగా.. వారందరూ అతడ్ని పట్టించుకోకపోవడం మరింత శోచనీయం.

ప్రాణాలతో పోరాడుతున్న తన కొడుకును తల్లి కూడా పట్టించుకోకపోవడం ఈ ఘటనలో మరింత విషాదాన్ని కలిగించింది. రక్త సంబంధం ఉన్న వారు సైతం దూరంగా ఉండగా, జీవిత భాగస్వామిగా జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భార్య కూడా అతనిని స్మశాన వాటికలో వదిలేసి వెళ్లిపోవడం హృదయ విదారకంగా మారింది.

స్మశానం.. సాధారణంగా మనిషి జీవితానికి చివరి మజిలీ. కానీ ఇంకా బ్రతికే ఉన్న ఒక మనిషికి అది ఆశ్రయం కావడం ఎంతటి దుర్భర పరిస్థితో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అక్కడ ఒంటరిగా, అనారోగ్యంతో అశక్తంగా పడి ఉన్న శ్రీధర్‌ను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే స్పందించి మానవత్వాన్ని చూపించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ భర్త రాము వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తక్షణమే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని శ్రీధర్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

వివాహ సమయంలో భార్యాభర్తలు ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. సుఖంలోనే కాదు, కష్టాల్లో కూడా ఒకరికి ఒకరు అండగా ఉండాలనే భావనతోనే ఆ బంధం ఏర్పడుతుంది. ఇలాంటి ఘటనలతో భార్యాభర్తల బంధాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ సంఘటన కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషాద గాథ మాత్రమే కాదు.. సమాజంలో సంబంధాల విలువలు ఎంతగా క్షీణించాయో చూపించే అద్దం లాంటిది.

అయితే మరోవైపు, స్థానికులు చూపించిన మానవత్వం ఆశను కలిగిస్తోంది. రక్త సంబంధం లేకపోయినా, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన వారు సమాజంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారనే నమ్మకాన్ని నిలబెట్టారు.

Follow Us