
ఒకప్పుడు జీవనోపాధి కోసం తలుపుతట్టినా అవకాశాలు దొరకలేదు. సమాజం చిన్నచూపు చూసింది. గౌరవం కంటే అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు అదే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఖాకీ తరహా యూనిఫామ్ ధరించి ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా (HYDRAA)లో ఉద్యోగాలు పొందిన ట్రాన్స్జెండర్ సిబ్బంది జీవితాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.
తెలంగాణలో సమాన అవకాశాల దిశగా ఇది ఒక కొత్త అడుగుగా నిలుస్తోంది. ప్రస్తుతం హైడ్రాలో 16 మంది ట్రాన్స్జెండర్లు పనిచేస్తున్నారు. వీరిలో 11 మంది ట్రాన్స్వుమెన్, ఐదుగురు ట్రాన్స్మెన్ ఉన్నారు. అధికారులు వీరిని ప్రత్యేకంగా “హైడ్రా ఈగిల్ టీమ్”గా పిలుస్తున్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం నిర్వహించే యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్లలో ఈ బృందం చురుగ్గా పాల్గొంటోంది. ఎక్కడైనా.. ఎప్పుడైనా విధులకు సిద్ధమని టీమ్ సభ్యులు చెబుతున్నారు. ఆక్రమణదారుల ప్రభావం ఎంత ఉన్నా వెనక్కి తగ్గకుండా పనిచేస్తున్నారని అధికారులు ప్రశంసిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో సుమారు 862 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణలో ఈగిల్ టీమ్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల మాదాపూర్లోని ఇదులకుంట చెరువు పరిరక్షణ చర్యల్లో కూడా ఈ బృందం పాల్గొంది. ఫీల్డ్ డ్యూటీలతో పాటు ప్రజలతో మాట్లాడే బాధ్యతను కూడా వీరు సమర్థంగా నిర్వహిస్తున్నారు. కూల్చివేతలు, ఆక్రమణ తొలగింపు సమయంలో ఉద్రిక్త పరిస్థితులను శాంతింపజేయడంలో ట్రాన్స్జెండర్ సిబ్బంది ప్రత్యేక నైపుణ్యం చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలతో మాట్లాడటం, ప్రజలకు పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడం, అధికారులకు, స్థానికులకు మధ్య వారధిగా వ్యవహరించడం వంటి అంశాల్లో వీరి పాత్ర కీలకంగా మారింది.
ఈ ఉద్యోగంతో తమ జీవితాల్లో పెద్ద మార్పు వచ్చిందని ట్రాన్స్జెండర్ ఉద్యోగులు చెబుతున్నారు. “డబ్బుకంటే గౌరవం ముఖ్యం. హైడ్రా యూనిఫామ్ వేసుకుని బయటకు వెళ్తే ఇప్పుడు ప్రజలు గౌరవంగా చూస్తున్నారు” అని గాయత్రి పేర్కొన్నారు. అవకాశమిస్తే ట్రాన్స్జెండర్లు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె అన్నారు. సమానంగా చూసిన తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రుచిత మాట్లాడుతూ.. “చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటం వల్ల సమాజంలో మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది” అని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే సంస్థలో భాగమవడం ఆనందంగా ఉందన్నారు. తన్షి రాయ్ మాట్లాడుతూ.. “ఒకప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్లు బతుకుదెరువు కోసం అడుక్కోవాల్సి వచ్చేది. సమాజంలో అవమానాలు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు హైడ్రా యూనిఫామ్లో కనిపిస్తే ప్రజలు గౌరవంగా మాట్లాడుతున్నారు” అని భావోద్వేగంగా చెప్పారు.
సామాజిక సమానత్వం, ఉపాధి అవకాశాలు, గౌరవప్రదమైన జీవితం దిశగా హైడ్రా తీసుకున్న ఈ చర్య తెలంగాణలో సమగ్ర పాలనకు ఒక ఉదాహరణగా మారుతోంది. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగం ఇవ్వడం మాత్రమే కాదు.. వారికి సమాజంలో గుర్తింపు, ఆత్మగౌరవం, కొత్త జీవితాన్ని అందించడమే ఈ ప్రయత్నం అసలు విజయంగా కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..