‘వామ్మో.. ఎంత తాగావ్ బ్రో.. గిన్నీస్ బుక్లో నీ పేరు పక్కా!’ డ్రంక్ అండ్ డ్రైవ్లో రికార్డు బద్దలు
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నిత్యం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఎక్కడికక్కడ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే రాత్రిపూట జరిగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సమయంలో తాగుబోతులు చేసే రచ్చ అంతాఇంతా కాదు. కొందరు బుకాయిస్తూ వాగ్వాదానికి దిగితే, మరికొందరైతే పొంతనలేని వింత సమాధానాలతో..

హైదరాబాద్, మార్చి 25: మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కొందరు దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల తరచూ లెక్కకు మించి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు నిత్యం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఎక్కడికక్కడ చేస్తుంటారు. అయితే రాత్రిపూట జరిగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సమయంలో తాగుబోతులు చేసే రచ్చ అంతాఇంతా కాదు. కొందరు బుకాయిస్తూ వాగ్వాదానికి దిగితే, మరికొందరైతే పొంతనలేని వింత సమాధానాలతో అడ్డంగా బుక్కై పోతుంటారు. తాజాగా అటువంటి షాకింగ్ సీన్ హైదరాబాద్లో సోమవారం (మార్చి 24) చోటు చేసుకుంది. అయితే ఇది అలాంటి ఇలాంటి సీన్ కాదు.. ఏకంగా గిన్నీస్ బుక్ ఎక్కించే రికార్డు మరీ. అసలేం జరిగిందంటే..
ఓ మందుబాబు వాటర్ ట్యాంకర్ నడుపుతూ అటుగా వచ్చాడు. ఇంతలో పోలీస్ బాబాయిలు సదర ట్యాంకర్ను ఆపు చేసి, డ్రైవర్ను కిందికి పిలిచారు. దీంతో పోలీసులు అందరికీ చేస్తున్నట్లే అతగాడికి కూడా బ్రీత్ అనలైజర్ తీసుకొచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేశారు. అయితే అది ఒక్కసారిగా చెవులు చిళ్లులుపడేటట్లు అరవసాగింది. పోలీసులకు అనుమానం వచ్చి రీడింగ్ చూసి దెబ్బకు పరేషాన్ అయ్యారు. BAC పాయింట్లు ఏకంగా 325 వచ్చాయ్ మరి.. దీంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం వాహనం సీజ్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట వైపు ఓ వాటర్ ట్యాంకర్ వద్ద చోటు చేసుకుంది. ఉప్పల్ నుంచి పంజాగుట్ట మీదుగా అమీర్పేట వైపు వెళ్తున్న ట్యాంకర్ను అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆపి చెక్ చేయగా సదరు మందుబాబు రికార్డు వెలుగు చూసింది. అనంతరం ఎంత తాగావని ట్రాఫిక్ ఎస్ఐ అతడిని ప్రశ్నించగా.. అతడు సమాధానం చెప్పకుండా అమాయకంగా నిలబడడం విశేషం. ఈ మేరకు పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు వివరాలు వెల్లడించారు.
ఇక ఈ వార్త వైరల్గా మారడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.’బ్రో.. ఎన్ని లీటర్లు తాగావ్’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే అంత తాగాడో పాపం.. అంటూ మరికొందరు సానుభూతి తెలుపుతున్నారు. సాధారణంగా డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో బ్రీత్ ఎనలైజర్ మిషన్ ఆల్కాహాల్ శాతం 100 చూపిస్తేనే పోలీసులు గుడ్లు తేలేస్తారు. రక్తంలో శాతం 30 మిల్లీ గ్రాములు దాటితే కేసు నమోదు చేస్తారు. 50 మిల్లీ గ్రాముల ఉంటే ఆ వ్యక్తి స్పృహాల్లో లేనట్లు గుర్తిస్తారు. వందకు మించి రీడింగ్ నమోదైన సందర్భాలు చాలా అరుదు. ఇతగాడి రీడింగ్ ఏకంగా 325 పాయింట్లు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.